అత్యవసర పరిస్థితి ఏర్పడితే.. అఖిలేష్ మరో పార్టీ మద్దతు కోరుతారా?
ఒకవేళ అత్యవసర పరిస్థితులు గనుక ఏర్పడితే.. అవతలి పార్టీ మద్దతు తీసుకునైనా ప్రభుత్వాన్ని కొనసాగించాలని అఖిలేష్ భావిస్తున్నట్టు సమాచారం.
లక్నో: చిన్నకోడలు అపర్ణయాదవ్ ఎస్పీ వారసులురాలిగా చేయడం కోసం తనయుడు అఖిలేష్ ను ఎస్పీ చీఫ్ ములాయం పార్టీ నుంచి గెంటేశారన్న వాదనలు బలంగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. తండ్రి-కొడుకుల మధ్య పార్టీ నిలువునా చీలిపోవడంతో ప్రస్తుతం అటు పార్టీ, ఇటు ప్రభుత్వ ఉనికి ప్రశ్నార్థకంగా మారుతోంది.
ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ లో 404 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. అందులో సమాజ్ వాదీ బలం 229. అయితే తండ్రి-కొడుకుల మధ్య పార్టీ చీలిపోవడంతో.. ఎవరి వైపు ఎంత మెజారిటీ ఉంటుందన్నది ఆసక్తిని రేకెత్తిస్తోన్న అంశం.
కాగా, ఈ ఉదయం అఖిలేష్ నిర్వహించిన సమావేశానికి ఆయనకు మద్దతుగా 150మంది ఎమ్మెల్యేలు వచ్చారు. మరోవైపు మరో 70మంది ఎమ్మెల్యేలు ములాయం వెంట ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇలాంటి తరుణంలో.. ఒకవేళ అత్యవసర పరిస్థితులు గనుక ఏర్పడితే.. అవతలి పార్టీ మద్దతు తీసుకునైనా ప్రభుత్వాన్ని కొనసాగించాలని అఖిలేష్ భావిస్తున్నట్టు సమాచారం.
యూపీ అసెంబ్లీలో కాంగ్రెస్ కు-28 బీజేపీ-40, బీఎస్పీకి-80 మంది సభ్యుల బలముంది. ఆర్ఎల్డీకి 8 మంది సభ్యుల బలముంది. ఒకవేళ ములాయం సింగ్ యాదవ్ గనుక ప్రభుత్వాన్ని కూలగొట్టే ప్రయత్నం చేస్తే.. వేరే పార్టీ మద్దతు తీసుకునైనా ప్రభుత్వాన్ని కొనసాగించాలని అఖిలేష్ భావిస్తున్నారు. శనివారం మధ్యాహ్నాం ములాయం ఇంట జరిగే భేటీ తర్వాత ఈ విషయాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.