యూపీలో ఎస్పీకి ఎదురుదెబ్బ.. రాజ్యసభకు దూరం.. బీజేపీ గూటికి నీరజ్..!
ఢిల్లీ : యూపీలో సమాజ్వాదీ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. లోక్సభ ఎన్నికల్లో ఘోర వైఫల్యం చెందిన ఆ పార్టీకి వరుస ఘటనలు ఇబ్బందికరంగా మారుతున్నాయి. తాజాగా ఆ పార్టీకి రాజ్యసభ సభ్యుడు నీరజ్ శేఖర్ గుడ్ బై చెప్పడం చర్చానీయాంశమైంది. దాంతో యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ సారధ్యంలోని సమాజ్వాదీ పార్టీకి కోలుకోలేని దెబ్బగా అభివర్ణిస్తున్నారు కొందరు.
మాజీ ప్రధాని చంద్రశేఖర్ కుమారుడైన నీరజ్ శేఖర్ సమాజ్వాదీ పార్టీలో కొనసాగుతున్నారు. ఆ మేరకు ఆయనకు రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇచ్చారు పార్టీ పెద్దలు. అయితే ఎంపీ పదవితో పాటు పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయడం హాట్ టాపికైంది. అదలావుంటే ఆయన త్వరలో కమల తీర్థం పుచ్చుకునే అవకాశాలు మెండుగా ఉన్నట్లు తెలుస్తోంది.
కోట్లు స్వాహా.. నామినేటెడ్ పోస్టు ఊసు లేదు.. మురళీధర్రావుపై హైకోర్టులో పిటిషన్..!
సమాజ్వాదీ పార్టీ నుంచి బయటకు రావాలనుకునే క్రమంలో రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడిని కలిశారు. తన రాజీనామా లేఖను సమర్పించారు. అయితే తాను ఎలాంటి వత్తిడి లేకుండా స్వచ్ఛందంగానే రాజ్యసభ పదవికి రాజీనామా చేస్తున్నట్లు నీరజ్ రిజైన్ లెటర్లో పేర్కొనడంతో వెంటనే ఆమోదించారు. ఇన్నాళ్లు సమాజ్వాదీ పార్టీలో క్రీయాశీలకంగా పనిచేసిన నీరజ్ శేఖర్ ఆ పార్టీకి దూరం కావడం ఆసక్తికరంగా మారింది. మరోవైపు ఆయన బీజేపీలో చేరనున్నారనే ప్రచారం జోరందుకోవడంతో యూపీ రాజకీయాలు వేడెక్కాయి.