మెమెన్ భార్యకు రాజ్యసభ సీటు? (వీడియో)
ముంబై: 1993 ముంబై వరుస బాంబు పేలుళ్లు సృష్టించి ఉరి శిక్షకు గురైన యాకూబ్ మెమెన్ కుటుంబ సభ్యులను రాజకీయంగా పైకి తీసుకు వచ్చి ఒక వర్గంలో సానూభూతి సంపాదించాలని సమాజ్ వాదీ పార్టీ నాయకులు ప్రయత్నిస్తున్నారు.
యాకూబ్ మెమెన్ భార్యను రాజ్యసభకు పంపించడానికి ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. యాకూబ్ మెమెన్ కుటుంబ సభ్యులు గ్రీన్ సిగ్నల్ ఇస్తే యాకూబ్ మెమెన్ భార్య రహీనా మెమెన్ ను రాజ్యసభకు నామినేట్ చేస్తామని మహారాష్ట్ర సమాజ్ వాదీ పార్టీ నేతలు అంటున్నారు.
సమాజ్ వాదీ పార్టీ మహారాష్ట్ర రాష్ట్ర శాఖ ఉపాధ్యక్షుడు ఫరూఖ్ ఘోషి ఇప్పటికే ఎస్ పీ సుప్రీం ములాయం సింగ్ యాదవ్ కు ఈ విషయంపై లేఖ వ్రాశారు. ములాయం సింగ్ యాదవ్ సమాధానం కోసం మహారాష్ట్ర సమాజ్ వాదీ పార్టీ నాయకులు ఎదురు చూస్తున్నారు. 1993 ముంబై వరుస బాంబు పేలుళ్ల కేసులో యాకూబ్ మెమెన్ అరెస్టు అయ్యాడు.
థ్రిల్లర్ సినిమా ను తలతన్నే విధంగా అనేక ట్విస్ట్ లతో చివరికి జులై 30వ తేదిన ఉదయం 6.40 గంటలకు నాగ్ పూర్ సెంట్రల్ జైలులో యాకూబ్ మెమెన్ ను ఉరి తీశారు. మగ దిక్కును కొల్పోయిన యాకూబ్ మెమెన్ భార్యను రాజకీయంగా పైకి తీసుకు వచ్చి మహారాష్ట్రలో తమ సత్తా చాటుకోవాలని ఆ రాష్ట్ర సమాజ్ వాదీ పార్టీ నాయకులు ప్రయత్నిస్తున్నారు. ముంబై బాంబు పేలుళ్ల కేసులో యాకూబ్ మెమెన్ భార్య రహీనా మెమెన్ జైలుకు వెళ్లిన విషయం తెలిసిందే.