అట్టుడికిన యూపీ.. ఎస్పీ కార్యకర్తలకు లాఠీ దెబ్బలు.. బీజేపీపై దీదీ, చంద్రబాబు గుస్సా
లక్నో : మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ ను మంగళవారం లక్నో విమానాశ్రయంలో అడ్డుకున్న దరిమిలా ఉత్తర్ ప్రదేశ్ అట్టుడికిపోయింది. సమాజ్వాదీ పార్టీ కార్యకర్తల నిరసనలతో పలుచోట్ల పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో బీజేపీ, ఎస్పీ మధ్య వార్ మరింత ముదిరినట్లైంది. అలహాబాద్ యూనివర్శిటీలో విద్యార్థినేత ప్రమాణస్వీకారానికి వెళుతున్న తనను అడ్డుకోవడం సరికాదని మండిపడుతున్నారు అఖిలేశ్. శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందనే కారణంతో.. కేంద్రం కుట్రకు పాల్పడిందని ఆరోపించారు. అఖిలేశ్ ను అధికారులు అడ్డుకోవడంతో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు మిన్నంటాయి.
భగ్గుమన్న కార్యకర్తలు.. లాఠీలు ఝలిపించిన పోలీసులు
లక్నో విమానాశ్రయంలో అధికారులు తనను అడ్డుకోవడంపై మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ గుర్రుగా ఉన్నారు. కుంభామేళాతో పాటు మరికొన్ని కార్యక్రమాలకు హాజరుకావాల్సి ఉందని చెప్పినా.. అధికారులు వినిపించుకోలేదని ఫైరవుతున్నారు. అదలావుంటే అఖిలేశ్ ను అడ్డుకోవడంతో ఎస్పీ కార్యకర్తలు అసెంబ్లీ సముదాయంతో పాటు విమానాశ్రయం దగ్గరకు చేరుకుని ఆందోళన చేపట్టారు. రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు దిగారు. ప్రయాగ్రాజ్లో ఎంపీ ధర్మేంద్ర యాదవ్ నేతృత్వంలో పెద్దఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. దీంతో పోలీసులు లాఠీలు ఝలిపించారు. ఆ క్రమంలో ధర్మేంద్ర యాదవ్ కు గాయాలయ్యాయి. గోరఖ్పూర్లో నిరసనకు దిగిన ఎస్పీ కార్యకర్తలు.. కొన్ని వాహనాల అద్దాలను ధ్వంసం చేయడంతో పరిస్థితి చేయి దాటింది.
చట్టసభల్లో రచ్చ రచ్చ.. దీదీ చురక
అఖిలేశ్ యాదవ్ ను అడ్డుకున్న తీరు సరికాదంటూ ఎస్పీ, బీఎస్పీ ప్రజాప్రతినిధులు భగ్గుమన్నారు. అసెంబ్లీతో పాటు శాసనమండలిలో నిరసన గళం వినిపించారు ఆ పార్టీల సభ్యులు. దీంతో రెండు సభలు దద్ధరిల్లిపోయాయి. సమాజ్ వాదీ సభ్యులు రాజ్భవన్కు చేరుకుని ధర్నాకు దిగారు. అఖిలేశ్తో పాటు ఎమ్మెల్యే జిజ్ఞేశ్ మేవానీని కూడా అడ్డుకున్నారని మండిపడ్డారు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. దురహంకారంతోనే బీజేపీ ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని ధ్వజమెత్తారు.
అఖిలేశ్ కు చంద్రబాబు ఫోన్
లక్నో విమానాశ్రయంలో అఖిలేశ్ యాదవ్ ను అడ్డుకోవడాన్ని.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రంగా ఖండించారు. అఖిలేశ్ తో ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. దేశంలో ప్రజాస్వామ్యానికి అర్థం లేకుండా పోయిందని ఆరోపించారు. యూపీ ప్రభుత్వం అనుసరించిన విధానం సరికాదని మండిపడ్డారు. రాజకీయ ప్రత్యర్థులపై బీజేపీ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ధ్వజమెత్తారు. ఇదంతా కూడా బీజేపీ అసహనానికి నిదర్శనమని వ్యాఖ్యానించారు.