చంద్రబాబుతో మాట్లాడ్తా, విభజనకు నో: ములాయం
న్యూఢిల్లీ: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుతో తృతీయ కూటమి ఆలోచనలో ఉన్న సమాజ్ వాది పార్టీ అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్ చర్చలు జరుపుతామని అన్నారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు. తృతీయ కూటమి ఏర్పాటు చేస్తామంటున్నారు కాదా.. మీరు చంద్రబాబును కలిసి మాట్లాడతారా అని మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. త్వరలోనే ఈ విషయంపై చంద్రబాబుతో చర్చిస్తానని తెలిపారు.
భారతీయ జనతా పార్టీ(ఎన్డీఏ) కూటమితో చంద్రబాబు నాయుడు పొత్తు పెట్టుకుంటారని వార్తలు వస్తున్న నేపథ్యంలో ములాయంసింగ్ యాదవ్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఇటీవల ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ ప్రధాని అభ్యర్థి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ, చంద్రబాబు నాయుడులు ఒకే వేదికను పంచుకున్నారు. హైదరాబాద్లో బిజెపి చేపట్టిన నవభారత యువభేరీ సభలో నరేంద్ర మోడీ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావుపై ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందె.
పశ్చిమ ఉత్తరప్రదేశ్ రాష్ట్రాన్ని హరిత ప్రదేశ్ పేరిట ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్న రాష్ట్రీయ లోక్దళ్ నేత అజిత్ సింగ్కు విరుద్ధంగా ములాయం స్పందించారు. తాను చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు వ్యతిరేకమని ములాయంసింగ్ యాదవ్ అన్నారు. చిన్న రాష్ట్రాలతో వనరులు, నక్సలిజం మొదలైన సమస్యలు వస్తాయని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం రూపొందించిన నోట్ను కేంద్ర మంత్రివర్గం అక్టోబర్ 3న ఆమోదించిన నేపథ్యంలో ఆయన పైవిధంగా స్పందించారు.
తెలంగాణ నోట్కు కేంద్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపిన నేపథ్యంలో అజిత్ సింగ్ హరిత ప్రదేశ్ ఏర్పాటుపై ప్రస్తావించినట్లు తెలిసింది. రాష్ట్రీయ లోక్దళ్, బహుజన సమాజ్వాది పార్టీలు చిన్న రాష్ట్రాలను స్వాగతిస్తుండగా సమాజ్ వాది పార్టీ మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. దాణా కుంభకోణంలో అరెస్టయిన బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూప్రసాద్ యాదవ్పై స్పందించేందుకు ములాయం నిరాకరించారు. నేర చరితులకు సంబంధించిన ఆర్డినెన్స్ను తమ పార్టీ ముందునుంచి వ్యతిరేకించిందని ఆయన తెలిపారు.