ఉగ్రవాదులు ఏకె47తో బెదిరించారు: ఎస్పీ సల్వీందర్
గురుదాస్పూర్: తనను కిడ్నాప్ చేసినప్పుడు తాను పోలీసు అధికారినని ఉగ్రవాదులకు తెలియదని ఎస్పీ సల్వీందర్ సింగ్ తెలిపారు. ఇటీవల అపహరణకు గురై క్షేమంగా విడుదలైన పంజాబ్లోని గురుదాస్పూర్ ఎస్పీ సల్వీందర్సింగ్.. కిడ్నాప్ ఘటనకు సబంధించిన వివరాలను మంగళవారం మీడియాకు వెల్లడించారు.
‘గురుద్వార్కి ఎస్యూవీ వాహనంలో వెళ్తుండగా నలుగురైదుగురు వచ్చి మా వాహనాన్ని అడ్డుకున్నారు. ఉగ్రవాదులు వారి వద్ద ఉన్న ఏకే 47 ఆయుధాలతో మమ్మల్ని చంపేస్తామని బెదిరిస్తూ.. కాళ్లూ చేతులు కట్టేశారు. వాళ్లంతా హిందీ, ఉర్దూ భాషల్లో మాట్లాడారు. ఆ సమయంలో నేను గురుద్వార్కి వెళ్తున్నాను కాబట్టి పోలీసు దుస్తుల్లో కాకుండా సాధారణ దుస్తుల్లో ఉన్నాను' అని సల్వీందర్ సింగ్ తెలిపారు.
‘మా దగ్గర ఆయుధాలు ఏమీ లేవు. ఒక వేళ ఆ సమయంలో తుపాకీ ఉంటే.. ముష్కరులతో యుద్ధంచేసి అమరుడయ్యేవాడిని. మా వద్ద ఉన్న సెల్ఫోన్లు లాక్కుని .. కాళ్లు, చేతులు కట్టేసి దాడిచేశారు. నోటికి ప్లాస్టర్ అంటించి కిడ్నాప్ చేశారు. అప్పుడు పాకిస్థాన్లోని వాళ్ల కమాండర్లకు ఫోన్ చేసి మాట్లాడారు. హిందీ, ఉర్దూ భాషను ఉపయోగించారు' అని చెప్పారు.
‘ఆ సమయంలో నాతోపాటు డ్రైవర్, మరో వ్యక్తి కూడా ఉన్నారు. నన్ను విడుదల చేశాకే నేను పోలీసునని వాళ్లకు తెలిసింది. మళ్లీ వాళ్లు నా దగ్గరికి వచ్చి ఎవరికైనా చెబితే చంపేస్తామంటూ బెదిరించి వెళ్లారు' అని సల్వీందర్ సింగ్ మీడియాకు వివరించారు. ఆ వెంటనే ఉగ్రవాదులకు సంబంధించిన వివరాలను గుర్దాస్ పూర్ ఎస్ఎస్పీకి ఫోన్ చేసి తెలిపినట్లు చెప్పారు.
కాగా, ఎస్పీని అపహరించిన అనంతరం ఉగ్రవాదులు పఠాన్కోట్ వైమానిక స్థావరంపై దాడిచేసి బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. ఉగ్రదాడిలో ఏడుగురు జవాన్లు అమరులయ్యారు. భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో ఇప్పటి వరకు ఆరుగురు ఉగ్రవాదులు హతమయ్యారు.