ఆ విషయం తెలిసి ఊపిరి పీల్చుకున్న ఇండియన్స్.. స్పెయిన్పై రెండో అతిపెద్ద దాడి
ఈ ఘటనలో భారతీయులెవరూ లేరని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ ప్రకటించారు.
స్పెయిన్: ఉగ్ర పంథా మార్చిన తీవ్రవాదులు ట్రక్కులు, వ్యానులతో మారణహోమం సృ ష్టిస్తూనే ఉన్నారు. తాజాగా స్పెయిన్ లోని బార్సిలోనాలోని రద్దీగా ఉండే లస్ రంబ్లస్ రహదారిలో ఐఎస్ఐఎస్ కు చెందిన ఉగ్రవాదులు వ్యాన్ తో విరుచుకుపడ్డారు.
పాదాచారులను ఢీకొడుతూ దాదాపు 13మంది ప్రాణాలు బలిగొన్నారు.ఈ ఘటనలో భారతీయులెవరూ లేరని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ ప్రకటించారు. దీంతో స్పెయిన్ లో ఉంటున్న తమవాళ్ల గురించి ఆందోళన చెందిన భారతీయులు ఊపిరి పీల్చుకున్నారు.
ఇది రెండో భారీ దాడి:
ఉగ్రదాడిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉగ్రదాడిని ఖండించారు.
2004 మార్చిలో స్పెయిన్ లోని మాడ్రిడ్ లో అల్ ఖైదా ప్రేరేపిత ఉగ్రవాదులు రైలుపై బాంబులతో విరుచుకుపడ్డ ఘటన తర్వాత ఇదే రెండో భారీ ఉగ్రదాడి అని అక్కడి వర్గాలు చెబుతున్నాయి.
అప్పటి ఘటనలో 191 మంది ప్రాణాలు కోల్పోయారు. గతంలో ఫ్రాన్స్ లోని నీస్ లోను ఇదే తరహాలో ఉగ్రవాదులు వ్యానుతో ఢీకొట్టిన మారణహోమానికి పాల్పడిన సంగతి తెలిసిందే.
Recommended Video
ఆ టెక్నాలజీ కష్టమే:
తాజా ఘటనలో గాయపడిన 50 మందికిపైగా క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఉగ్రవాదులు తమ పంథా మార్చడంతో.. వారి ఉగ్ర పోకడలను కనిపెట్టడం కష్టంగా మారింది.
బాంబులు, మారణాయుధాలను గుర్తించే టెక్నాలజీ అందుబాటులో ఉన్నప్పటికీ.. ఇలా ట్రక్కులు, వ్యానులతో జరగబోయే మారణహోమాన్ని గుర్తించడం అసాధ్యంలా మారింది. వ్యాను వేగం ధాటికి జనాలు చెల్లాచెదురుగా ఎగిరిపడ్డారని ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు.
ఇద్దరు ఉగ్రవాదులే ఇదంతా:
ఈ దాడిలో ఇద్దరు ఉగ్రవాదులు పాల్గొని పథకం అమలు చేశారని, ఒక వ్యక్తి దాడికి పాల్పడగా, రెండో వ్యక్తిని కాటలోనియాలోని విక్ పట్టణంలో పోలీసులు గుర్తించినట్టు తెలుస్తోంది. ఈ దాడి తమ వాళ్లే చేశారని ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థ ప్రకటించడం గమనార్హం.
హైఅలర్ట్:
బార్సిలోనాతో పాటు స్పెయిన్ లోని ప్రధాన పట్టణాలన్నింట్లో హై అలెర్ట్ ప్రకటించారు. మెట్రో, రైల్వే స్టేషన్లను తాత్కాళికంగా మూసివేశారు. అడుగడుగునా తనిఖీలతో నగరాన్ని జల్లెడ పడుతున్నారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. అనుమానితులు ఎవరు కనబడినా సమాచారం అందించాలని సూచించారు. మరో ఉగ్రవాదిని కాటలోనియాలోని విక్ పట్టణంలో పోలీసులు గుర్తించినట్టు వార్తలు వెలువడుతున్నాయి.