గాల్వాన్లో చైనాకు భారీ షాక్.. కృత్రిమ నిర్మాణాలపై ప్రకృతి ప్రకోపం.. చర్చల్లో అసాధారణ ప్రతిపాదన..
తూర్పు లదాక్ లోని గాల్వాన్ లోయను పూర్తిగా ఆక్రమించుకునేందుకు చైనా పన్నిన దుష్టపన్నాగం బెడిసికొట్టింది. డ్రాగన్ పాపిష్టి పనులపై ప్రకృతి సైతం కన్నెర్రజేసింది. భారీ బుల్డోజర్ల ద్వారా గాల్వాన్ నది దిశను మార్చేందుకు అది చేసిన ప్రయత్నం అట్టర్ ఫ్లాప్ అయింది. గాల్వాన్ లో ఒక్కసారిగా వరద పోటెత్తడంతో నది ఒడ్డు వెంబడి చైనా కృత్రిమ నిర్మాణాలన్నీ కొట్టుకుపోయి, అక్కడి క్యాంపులు తీవ్రంగా ఎఫెక్ట్ అయినట్లు తాజా శాటిలైట్ చిత్రాల్లో వెల్లడైంది. ఇటు శాంతి చర్చల ప్రక్రియకు తూట్లు పడేలా చైనా అసాధారణ ప్రతిపాదనను భారత్ ముందుంచింది.
చైనా కూడా ఇండియా ప్రాడక్ట్స్ బ్యాన్ చేస్తే.. కోలుకోలేని దెబ్బన్న డ్రాగన్.. ప్రతీకార హెచ్చరిక..
దక్షిణ చైనా సముద్రంలోలా..
పొరుగు దేశాలు, మిత్ర పక్షాలు అభ్యంతరం చెబుతున్నా వినిపించుకోని చైనా.. దక్షిణ చైనా సముద్రంలో పదులకొద్దీ కృత్రిమంగా ద్వీపాలను నిర్మించింది. అందుకోసం సముద్రం అడుగు భాగం నుంచి టన్నుల కొద్దీ ఇసుక తోడేసింది. ఇప్పుడు గాల్వాన్ లోయలోనూ సరిగ్గా ఇదే ఫార్ములా అనుసరించి బొక్కబోర్లా పడింది.
వై జంక్షన్ మూసేయడంతో..
కల్నల్ సంతోష్ బాబు సహా 20 మంది భారత జవాన్లను చైనా బలగాలు కిరాతకంగా చంపేసిన చోటు ‘14వ పెట్రోలింగ్ పాయింట్(పీపీ 14)'. దానిపై కబ్జాను నిలుపుకొనే క్రమంలో చైనా అనూహ్య చర్యలకు ఉపక్రమించింది. గాల్వాన్ నది రెండు పాయలుగా చీలిపోయే ‘వై జంక్షన్'ను పూర్తిగా మట్టితో కప్పేసి, 16 చోట్ల టెంట్లు, ట్రక్కుల్ని నిలిపింది. పీపీ 14 వద్ద గస్తీకి వెళ్లడానికి మనకున్న ఏకైక మార్గం ‘వై జక్షన్' కావడంతో చైనా వ్యూహాత్మకంగా దాన్ని మూసేసింది. ఇందుకోసం గాల్వాన్ నది అడుగు భాగం నుంచి భారీ ఎత్తున మట్టిని తోడేయడంతో అక్కడ అసాధారణ పరిస్థితి తలెత్తింది. రెండుమూడు రోజుల కిందట గాల్వాన్ నదిలో ఒక్కసారిగా వరద పోటెత్తడంతో చైనా క్యాంపులన్నీ కొట్టుకుపోయినట్లు తెలుస్తోంది.
పర్వతాల్లో మనదే పైచేయి..
పూర్తిగా పర్వతాలతో నిండిన లదాక్ ప్రాంతంలో తన ప్రభావాన్ని చాటుకునేందుకు చైనా పడుతోన్న అష్టకష్టాలు అన్నీ ఇన్నీ కావు. పర్వతాల్లో యుద్ధనైపుణ్యం విషయంలో భారత్ కు ఏమాత్రమూ పోటీ ఇవ్వలేమని తెలుసు కాబట్టే చైనా దొంగ దెబ్బలను మాత్రమే నమ్ముకుంటోంది. అటు పాకిస్తాన్ తో ఏళ్ల తరబడి కొనసాగుతోన్న ఉద్రిక్తతల ఫలితంగా మౌంటెయిన్ వార్ ఫేర్ లో భారత బలగాలు ఆరితేరాయి. 1984 నుంచీ సియాచిన్ పై పట్టు కొనసాగిస్తున్న మనవాళ్లకు గాల్వాన్ లోయలో చైనాను మట్టికరిపించడం ఏమంత లెక్కకాదని, అయితే శాంతికి మాత్రమే కట్టుబడి ఉండాలనుకుంటున్న కారణంగా, గొప్ప సహనంతో ఉద్రిక్తతల్ని నివారించే ప్రయత్నం జరుగుతున్నదని డిఫెన్స్ నిపుణులు తెలిపారు. మౌంటెయిన్ వార్ ఫేర్ లో బలహీనతను కప్పిపుచ్చుకునేందుకే చైనా.. మౌంటెన్ క్లైంబర్స్ (పర్వతారోహకుల)తోపాటు మార్షల్ ఆర్ట్స్ ఫైటర్స్ను మోహరించినట్లు అతిశయోక్తి కథనాలను ప్రచారంలోకి తీసుకొచ్చింది. ఇదిలా ఉంటే..
ఫింగర్ 2కి వెళ్లిపోండంటూ..
వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్ఏసీ) వెంబడి గడిచిన రెండు నెలలుగా ఉద్రిక్తత కొనసాగుతున్నది. ప్రధానంగా తూర్పు లదాక్ లోని గాల్వాన్ లోయ, పాంగాంగ్ సరస్సు, దానిని ఆనుకుని ఉండే ఫింగర్ పాయింట్స్, హాట్ స్ప్రింగ్స్ తదితర ప్రాంతాల్లో రెండు దేశాల సైన్యాలు ఎదురెదురుగా మోహరించి ఉండటంతో తీవ్రఉద్రిక్తతలు నెలకొన్నాయి. లెఫ్టినెంట్ జనరల్స్ మధ్య జూన్ 6నాటి చర్చల్లో బలగాల ఉపసంహరణకు అంగీకారం కుదిరినా, జూన్ 15న గాల్వాన్ లోయలో తీవ్ర హింస తలెత్తి రెండువైపులా భారీ ప్రాణనష్టం జరిగింది. మళ్లీ జూన్ 22నాటి ఎల్జే స్థాయి భేటీ కూడా అసంపూర్తిగా ముగిసింది. ఇక, జూన్ 30న(మంగళవారం) మూడోసారి జరిగిన చర్చల్లో.. భారత్ ఫింగర్ 2కు వెళ్లిపోవాలంటూ చైనా అసాధారణ ప్రతిపాదనను తెరపైకి తెచ్చినట్లు వెల్లడైంది.
Recommended Video
ముందు మీరు.. కాదు మీరే..
పాంగాంగ్ సరస్సుకు ఉత్తరంగా ఉండే పర్వత శ్రేణులను సైనిక పరంగా ఫింగర్ పాయింట్స్ అని వ్యవహరిస్తారు. ఫింగర్ 8 నుంచి వాస్తవాధీన రేఖ వెళుతుందని భారత్ వాదిస్తుండగా, ఫింగర్ 2 వరకూ భాగం తనదేనని చైనా బుకాయిస్తోంది. వాదనల సంగతి ఎలా ఉన్నా, కొన్ని దశాబ్దాలుగా ఫింగర్ 4 వరకు భారత్ పట్టుకొనసాగించింది. తాజా కవ్వింపుల్లో భాగంగా చైనా బలగాలు ఫింగర్ 4ను దాదాపుగా కబ్జా చేయగా, భారత బలగాలు బలంగా తిప్పికొట్టాయి. మంగళవారం నాటి ఎల్జే స్థాయి చర్చల్లో చైనా ఫింగర్స్ అంశాన్ని లేవనెత్తిందని, ముందుగా భారత్ ఫింగర్ 2కు వెళ్లిపోతే.. తాము ఫింగర్ 6 పాయింట్ వరకు వెనక్కి తగ్గుతామని చైనా ప్రతిపాదించగా.. స్టేటస్ కో మార్చింది మీరే కాబట్టి మీరే వెనక్కి వెళ్లిపోండంటూ చైనాను భారత్ హెచ్చరించినట్లు తెలిసింది.