సీఏఏ గురించి 10 ముక్కలు మాట్లాడగలవా.. రాహుల్కు కేంద్రమంత్రి సవాల్..
పౌరసత్వ సవరణ చట్టం(CAA)చట్టంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ దేశాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని కేంద్రమంత్రి జేపీ నడ్డా విమర్శించారు. సీఏఏ గురించి అసలేమీ తెలియకుండానే రాహుల్ మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. సీఏఏ గురించి గట్టిగా ఒక 10 వాక్యాలు మాట్లాడాలని సవాల్ విసిరారు. సీఏఏని వ్యతిరేకిస్తున్నవారు దేశాన్ని బలహీనపరుస్తున్నారని ఆరోపించారు. ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో నడ్డా మాట్లాడారు.
కొంతమంది వ్యక్తులు చట్టం గురించి అసలేమీ తెలియకుండానే.. తమ తెలివిని ప్రదర్శిస్తుంటారని నడ్డా విమర్శించారు. సీఏఏతో వచ్చిన సమస్యేంటో రాహుల్ రెండు ముక్కల్లో చెప్పాలన్నారు. మహాత్మా గాంధీ,జవహర్లాల్ నెహ్రూ,ఇందిరా గాంధీ లాంటి దిగ్గజాలు పొరుగుదేశాల్లో అణచివేతకు గురైన మైనారిటీలకు పౌరసత్వం కల్పించమని చెప్పారన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో అక్కడి మైనారిటీల సమస్యలను అర్థం చేసుకునే నాయకుడు ఒక్కరు కూడా లేరన్నారు. దేశంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 70 ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరించామని నడ్డా స్పష్టం చేశారు.
కేంద్ర ప్రభుత్వాన్ని వ్యతిరేకించడానికి ప్రతిపక్షాలకు వేరే అంశాలేవి లేవని,అందుకే సీఏఏని పట్టుకున్నారని విమర్శించారు. కాంగ్రెస్,వామపక్ష పార్టీలకు దేశం కంటే ముందు ఓటు బ్యాంకే ముఖ్యమని అన్నారు. కానీ నరేంద్ర మోదీకి దేశం తర్వాతే ఓట్లు అని అభిప్రాయపడ్డారు. పొరుగుదేశాల్లో అణచివేతకు గురై భారత్లో స్థిరపడ్డ మైనారిటీలకు మానవతా దృక్పథంతో పౌరసత్వం కల్పించడం ద్వారా.. వారికి సరైన విద్య,వైద్యం,ఉపాధి దొరుకుతుందన్నారు.
కాగా,పౌరసత్వ సవరణ చట్టం ద్వారా పాకిస్తాన్,బంగ్లాదేశ్,ఆఫ్ఘనిస్తాన్లలో నుండి శరణార్థులుగా భారత్కు వలసొచ్చిన మైనారిటీలకు పౌరసత్వం కల్పించనున్నారు. ఇందులో భాగంగా హిందు,సిక్కు,క్రైస్తవ,పార్శీ,బౌద్ద మతస్తులకు పౌరసత్వం కల్పించనున్నారు. అయితే ఈ చట్టంలో ముస్లింలకు మినహాయింపునివ్వడంపై తీవ్ర స్థాయిలో ఆందోళన వ్యక్తమవుతోంది. బీజేపీ మత ప్రాతిపదికన భారత్ను విడగొట్టి రాజకీయాలు చేయాలనుకుంటోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.