బీఎస్ యడ్యూరప్ప, శ్రీరాములు రాజీనామా: ఆమోదించిన స్పీకర్
బెంగళూరు/న్యూఢిల్లీ: ఇటీవల జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో యడ్యూరప్ప, శ్రీరాములు ఘన విజయం సాధించారు. ఈ నేపథ్యంలో వారు తమ తమ పార్లమెంటు సభ్యత్వాలకు రాజీనామా చేశారు. వారి రాజీనామాలను లోకసభ స్పీకర్ శనివార ఆమోదించారు.
కాగా, కాసేపట్లో బలపరీక్ష నిర్వహించనున్ననేపథ్యంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. బీజేపీ బలపరీక్షలో నెగ్గుతుందా లేదా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్, జేడీఎస్లు తమ ఎమ్మెల్యేలు బీజేపీలోకి వెళ్లకుండా కాపాడుకునే పనుల్లో ఉన్నారు.
అసెంబ్లీలో గెలిచినా.. యడ్యూరప్పకు షాకిచ్చేందుకు కాంగ్రెస్-జేడీఎస్ కొత్త ట్రంప్ కార్డ్
అయితే కాంగ్రెస్, జేడీఎస్లకు చెందిన లింగాయత్ వర్గానికి చెందిన ఎమ్మెల్యేలపైనే అందరి దృష్టి ఉంది. కాంగ్రెస్లో 18మంది, జేడీఎస్లో ఇద్దరు లింగాయత్ ఎమ్మెల్యేలు ఉన్నారు. బలపరీక్ష సమయంలో లింగాయత్ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్కు పాల్పడి యడ్యూరప్పకు మద్దతుగా ఓటేస్తారా అనే అనుమానాలు ఉన్నాయి.
కాంగ్రెస్ వైఖరి పట్ల లింగాయత్ వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు ఇప్పటికే అసంతృప్తితో ఉన్నారని, గతంలో తమ వర్గాన్ని విడదీసేందుకు ప్రయత్నించడమే కాకుండా ఇప్పుడు లింగాయత్కు వ్యతిరేకంగా భావిస్తున్న జేడీఎస్ పార్టీతో పొత్తు పెట్టుకోవడంతో వారు నిరాశ చెందారని బీజేపీ నేతలు చెబుతున్నారు.
గవర్నర్ అతి పెద్ద పార్టీగా అవతరించిన బీజేపీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించడంతో యడ్యూరప్ప సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం ఆయన తమ మనస్సాక్షి ప్రకారం శాసనసభ్యులు బలపరీక్షలో ఓట్లు వేయాలని కోరారు.