కాంగ్రెస్ రుణం తీర్చుకున్న స్పీకర్, అందుకే అనర్హత వేటు, నమ్మకద్రోహం !
బెంగళూరు: కాంగ్రెస్ పార్టీ రుణం తీర్చుకోవడానికి కర్ణాటక స్పీకర్ కేఆర్. రమేష్ కుమార్ తమ మీద అనర్హత వేటు వేశారని రెబల్ ఎమ్మెల్యే (కాంగ్రెస్) ఎస్.టి. సోమశేఖర్ అన్నారు. స్పీకర్ రమేష్ కుమార్ తమ మీద అనర్హత వేటు వేస్తారని ముందే ఊహించామని అనర్హత వేటు పడిన ఎమ్మెల్యే ఎస్.టి. సోమశేఖర్ చెప్పారు.
మీడియాతో మాట్లాడిన సోమశేఖర్ స్పీకర్ కేఆర్. రమేష్ కుమార్ నిర్ణయాన్ని సవాలు చేస్తూ తాము సుప్రీం కోర్టుకు వెలుతామని, న్యాయపోరాటం చేస్తామని అన్నారు. స్పీకర్ రమేష్ కుమార్ తమ మీద అనర్హత వేటు వేశారని, అయితే సుప్రీం కోర్టులో తమకు న్యాయం జరుగుతోందని సోమశేఖర్ చెప్పారు.
నమ్మకద్రోహానికి మారుపేరు మాజీ మంత్రి కృష్ణభైరేగౌడ (కాంగ్రెస్) అని సోమశేఖర్ మండిపడ్డారు. శాసన సభలో తమ గురించి కృష్ణభైరేగౌడ ఏం మాట్లాడారో పూర్తిగా గమనించామని సోమశేఖర్ చెప్పారు. జేడీఎస్ కు వెన్నుపోటు పొడిచి కాంగ్రెస్ లో చేరిన కృష్ణభైరేగౌడ ఇప్పుడు మాకు నీతులు చెబుతున్నారని సోమశేఖర్ విరుచుకుపడ్డారు.
మాజీ ప్రధాని హెచ్.డి. దేవేగౌడ మాటలు విని బెంగళూరు ఉత్తర లోక్ సభ నియోజక వర్గం నుంచి పోటీ చేసి కృష్ణభైరేగౌడ ఓడిపోయారని, ఆయన ఓటమికి తాము కారణం కాదని సోమశేఖర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న ప్రేమ, అభిమానంతో ఆ పార్టీ రుణం తీర్చుకోవడానికే తమ మీద స్పీకర్ రమేష్ కుమార్ అనర్హత వేటు వేశారని ఆరోపించారు. సుప్రీం కోర్టులో తమకు న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉందని సోమశేఖర్ ధీమా వ్యక్తం చేశారు.