రాజీనామాలా.. నాకు అందలేదే..? రెబల్ ఎమ్మెల్యేలు విడి విడిగా కలువాలన్న స్పీకర్ రమేశ్
బెంగళూరు : కర్ణాటక రాజకీయాల్లో పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. సంకీర్ణ సర్కార్ కాపాడుకునేందుకు కాంగ్రెస్, జేడీఎస్ శతవిధలా ప్రయత్నాలు చేస్తున్నాయి. మరోవైపు బీజేపీ లేదు.. లేదంటూనే రెండురోజులు వేచి చూస్తామనే సంకేతాలు ఇచ్చాయి. దీంతో కర్ణాటకలో అధికారం కోసం కాంగ్రెస్, జేడీయూ వర్సెస్ బీజేపీ మధ్య వార్ కొనసాగుతుంది. ఇందులో ఎమ్మెల్యేలు కీ రోల్ అయినందున .. వారిని కూల్ చేసేందుకు డీకే శివకుమార్ కూడా రంగంలోకి దిగారు. ఎమ్మెల్యేలు ముంబై హోటల్ నుంచి గోవాకు మారడంతో రాజకీయ వేడి మరింత సెగలు వేస్తోంది.
రాజీనామాలా ? అదేం లేదే ..?
13 మంది రెబల్ ఎమ్మెల్యేలు జేడీఎస్, కాంగ్రెస్ నేతలకు కంటికి కునుకు లేకుండా చేస్తున్నారు. వారి డిమాండ్లు తీరుస్తామని చెప్తున్నా .. బెట్టువీడటం లేదు. ముంబైలో ఉన్న వారిని కలిసేందుకు డీకే శివకుమార్ వెళ్లినా ఫలితం లేకుండాపోయింది. వెంటనే వారి మకాం గోవాకు మారిపోవడంతో కర్ణాటక సీఎం పీఠం సంకీర్ణ సర్కార్, బీజేపీ మధ్య దోబూచులాడుతుంది. ఈ క్రమంలో 10 మంది కాంగ్రెస్, ముగ్గురు జేడీఎస్ ఎమ్మెల్యేల రాజీనామాలను స్పీకర్ కే ఆర్ రమేశ్ కుమార్ ఆమోదించే అవకాశం లేదు. ఇవాళ తన నిర్ణయాన్ని స్పీకర్ వెలువడించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఎమ్మెల్యేల రాజీనామాపై స్పీకర్ స్పందించారు. తనకు ఇంతవరకు ఒక్క ఎమ్మెల్యే రాజీనామా కూడా అందలేదని స్పష్టంచేశారు. రాజీనామా చేశామని చెప్తున్న ఎమ్మెల్యేలు ఒక్కొక్కరు వచ్చి తనను కలువాలని సూచించారు.
గజ.. గజ...
రెబల్స్ క్యాంపుతో సంకీర్ఱ సర్కార్ గుండెల్లో రైళ్లు పరుగెత్తాయి. దీంతో కాంగ్రెస్, జేడీఎస్ మంత్రలతో రాజీనామా చేయించారు. కొత్త మంత్రివర్గం ఏర్పాటుచేస్తామని భరోసా కల్పించారు. క్యాబినెట్లో వారు చెప్పిన మూడు బెర్త్లు, ఒక నామినేటెడ్ పదవీ ఇస్తామని స్పష్టంచేశారు. అయినా ఎమ్మెల్యేలు మాత్రం మొండి వైఖరితో ఉన్నారు. జేడీఎస్, కాంగ్రెస్ అధినేతల వైఖరితో విసుగుచెంది రాజీనామా చేశామని స్పష్టంచేశారు. అయితే వారు ముంబై నుంచి పుణేకు మకాం మార్చడంతో ఏ క్షణం ఏం జరుగతుందనే ఉత్కంఠ నెలకొంది.
ఇదీ లెక్క ..!!
కర్ణాటక అసెంబ్లీలో 225 స్థానాలు ఉన్నాయి. ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 113 మంది సభ్యుల మద్దతు తప్పనిసరి. అయితే 105 సీట్లు గెలిచిన బీజేపీ .. అధికారానికి 8 సీట్ల దూరంలో నిలిచిపోయిన సంగతి తెలిసిందే. దీంతో జేడీఎస్ 37, కాంగ్రెస్ 78 సీట్లతో సంకీర్ణ ప్రభుత్వం కొలువుదీరింది. అయితే ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి సంకీర్ణ సర్కార్లో లుకలుకలు వినిపిస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం ప్రభుత్వానికి బీఎస్పీ ఒకరు ఇండిపెండెంట్లు ఇద్దరి మద్దతుతో 118 సభ్యుల మద్దతు ఉంది. ఒకవేళ 13 మంది ఎమ్మెల్యేల రాజీనామాను ఆమోదిస్తే ప్రభుత్వం మైనార్టీలో పడిపోతుంది. అప్పుడు సర్కార్ బలం 105కి చేరుకుంటుంది. స్పీకర్కు కూడా అప్పుడు ఓటు ఉంటుంది.