వేటు పడింది: స్పీకర్పై పేపర్లు చించి వేశారు... సస్పెన్షన్కు గురైన 7గురు కాంగ్రెస్ ఎంపీలు
న్యూఢిల్లీ: లోక్సభలో విపక్షాల రచ్చ కొనసాగుతోంది. ఢిల్లీ అల్లర్లపై చర్చ చేపట్టాల్సిందేనంటూ విపక్షపార్టీల సభ్యులు స్పీకర్ పోడియంను ముట్టడించేందుకు ప్రయత్నించారు. తమ స్థానాల్లోకి వెళ్లి కూర్చోవాల్సిందిగా పలు మార్లు స్పీకర్ కోరినప్పటికీ సభ్యులు వినలేదు. దీంతో స్పీకర్ వారందరినీ ఈ సమావేశాలు ముగిసేవరకు సస్పెండ్ చేస్తున్నట్లు ఆదేశాలు ఇచ్చారు.
సస్పెండయిన కాంగ్రెస్ ఎంపీల్లో గౌరవ్ గొగోయ్, రన్వీత్ సింగ్ బిట్టూ, ఎబె హిందోన్, రమ్యలు ఉన్నారు. వీరంతా లోక్సభ స్పీకర్ ఓంబిర్లాపై కొన్ని పేపర్లను చింపి విసిరారు. దీంతో క్రమశిక్షణ తప్పారని చెబుతూ స్పీకర్ వీరిపై సమావేశాల ముగిసేవరకు వేటు వేశారు. అయితే తమ సభ్యులను సస్పెండ్ చేయాలన్న నిర్ణయం స్పీకర్ది కాదని అది ప్రభుత్వ నిర్ణయం అని లోక్సభా విపక్షనేత అధిర్ రంజన్ చౌదరి చెప్పారు. సస్పెన్షన్కు బెదిరేది లేదని ఆయన స్పష్టం చేశారు. పార్లమెంటులోపలా పార్లమెంటు బయట తమ పోరాటం కొనసాగుతుందని అధిర్ రంజన్ చౌదురి చెప్పారు.
ఇదిలా ఉంటే గురువారం రోజున లోక్సభ సమావేశాలు ప్రారంభం కాగానే విపక్షాలు ఢిల్లీ అల్లర్లపై చర్చ చేపట్టాలంటూ సభలో నినాదాలు చేశాయి. ఉదయం 11 గంటలకు ప్రారంభం కాగానే ముందుగా సభ వాయిదా పడింది. ఆ తర్వాత మధ్యాహ్నం మరోసారి వాయిదా పడింది. ఆ తర్వాత 2 గంటల సమయంలో స్పీకర్ సభను రేపటికి వాయిదా వేశారు. ఇదిలా ఉంటే ఢిల్లీ అల్లర్లపై మార్చి 11న లోక్సభలో మార్చి 12న రాజ్యసభలో చర్చ చేపడదామని పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి చెప్పినప్పటికీ సభ్యులు వినలేదు. ఇంకా తమ నిరసనలను కొనసాగించారు. ఈ క్రమంలోనే ప్రత్యక్ష పన్నుల బిల్లుకు సభ ఆమోదం తెలిపింది.
Recommended Video
ఇక ఢిల్లీ అల్లర్లకు బాధ్యత వహిస్తూ కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా రాజీనామా చేయాల్సిందే అని విపక్షాలు డిమాండ్ చేశాయి. ఈ క్రమంలోనే మోడీ, అమిత్ షాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. స్పీకర్ వెల్లోకి దాదాపు 30 మంది కాంగ్రెస్ ఎంపీలు దూసుకెళ్లారు. స్పీకర్ ఎక్కడా అంటూ కొంతమంది గొడవకు దిగారు. వీవాంట్ జస్టిస్ అంటూ నినదించారు.