శ్రీలంకకు ప్రత్యేక ప్రాధాన్యత: రాజపక్సతో ప్రధాని మోడీ కీలక చర్చలు, భారీ సాయం
న్యూఢిల్లీ: పొరుగు దేశాలతో ద్వైపాక్షి సంబంధాలకు భారత్ మొదటి ప్రాధాన్యత ఇస్తామని, అందులో శ్రీలంకకు ప్రత్యేక స్థానం ఉంటుందని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. ప్రధాని మోడీ శ్రీలంక ప్రధానమంత్రి మహీంద రాజపక్సతో శనివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. ఇరు దేశాల అభివృద్ధిపై చర్చించారు.
శిఖరాగ్ర సమావేశంలో ప్రధానులిద్దరు ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలపై కూడా చర్చించారు. రానున్న ఐదేళ్లలో చేపట్టబోయే పలు అభివృద్ధి ప్రాజెక్టులపై ఓ అంగీకారం కుదుర్చుకున్నారు. ఇరు దేశాల మధ్య విమాన రాకపోకలను భారత్ ప్రతిపాదించింది.
కొలంబోలో పలు భారతీయ ఉత్పత్తుల దిగుమతిపై తాత్కాలిక ఆంక్షలను సడలిస్తారని ఆశిస్తున్నట్లు ప్రధాని మోడీ తెలిపారు. ఇరు దేశాల మధ్య ఉన్న బంధం ఎన్నో ఏళ్ల నాటిదని ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. భారత్-శ్రీలంక మధ్య సంబంధం వేల ఏళ్ల క్రితం నాటిదని అన్నారు. శ్రీలంకతో ద్వైపాక్షిక సంబంధాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తామని పునరుద్ఘాటించారు.
ఈ సందర్భంగా శ్రీలంక తమిళుల ససమస్యను పరిశీలించాలని రాజపక్సను కోరారు. కాగా, రెండు దేశాల మధ్య బౌద్ధ సంస్కృతిని ప్రోత్సహించేందుకు శ్రీలంకకు భారత్ 15 మిలియన్ డాలర్లు అందించనుంది. బౌద్ధ మఠాల పునరుద్ధరణ, ఇరు దేశాల మధ్య బౌద్ధ సంస్కృతి అభివృద్ధి, బౌద్ధ మతాధికారుల మద్దతుకు శ్రీలంక ఆ డబ్బును వినియోగించనుంది.
ప్రస్తుతం 1.1 బిలియన్ డాలర్ల పొరుగు దేశం అభ్యర్థనపై భారత్ చర్చలు జరుపుతోంది. కాగా, శ్రీలంక ప్రధానిగా రాజపక్స బాధ్యతలు చేపట్టిన తర్వాత మరో విదేశీ నేతతో ద్వైపాక్షిక చర్చలు జరపడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఆగస్టు 9, 2020న శ్రీలంక ప్రధానిగా రాజపక్స ప్రమాణం చేశారు.