వచ్చేవారం పార్లమెంటు ముందుకు ఎస్పీజీ చట్టసవరణ బిల్లు
న్యూఢిల్లీ: గాంధీ కుటుంబానికి ఎస్పీజీ రక్షణ తీసివేయడంపై ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ భగ్గుమంటున్న నేపథ్యంలో కేంద్రం వచ్చేవారం స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ చట్ట సవరణ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధం చేసింది.
గాంధీల స్వయం కృతాపరాధమే ఎస్పీజీ తొలగింపుకు కారణమా...?
పార్లమెంటు ముందుకు వచ్చేవారం ఎస్పీజీ చట్టసవరణ బిల్లు
ఎస్పీజీ చట్టంలో కేంద్ర ప్రభుత్వం స్వల్పంగా మార్పలు చేసినట్లు సమాచారం. ప్రధాన మంత్రి ఇతర వీవీఐపీలకు మాత్రమే స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ను ఇవ్వాలనే ప్రతిపాదనలు బిల్లులో చేర్చినట్లు తెలుస్తోంది. వచ్చేవారమే సభలో బిల్లును ప్రవేశపెడతామని కేంద్రమంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ చెప్పారు.
ప్రధానికి మాజీ ప్రధానికి మాత్రమే ఎస్పీజీ ప్రొటెక్షన్
వచ్చేవారం సభలో జరిగే బిజినెస్ గురించి చెబుతూ ఆ వారంలో ప్రవేశపెట్టబోయే బిల్లులతో పాటు ఎస్పీజీ చట్టసవరణ బిల్లున కూడా ప్రవేశపెడుతామని అర్జున్ రామ్ మేఘవాల్ చెప్పారు. ప్రస్తుతం ప్రధాన మంత్రి అతని కుటుంబ సభ్యులకు ఎస్పీజీ ప్రొటెక్షన్ ఇస్తుండగా మాజీ ప్రధాని అతని కుటుంబ సభ్యులకు కొంతకాలం పాటు ఎస్పీజీ ప్రొటెక్షన్ ఇస్తున్నారు. అదికూడా మాజీ ప్రధానికి ఏమైనా ప్రాణహాని ఉంటే ప్రొటెక్షన్ను కొనసాగిస్తున్నారు.
గాంధీ కుటుంబానికి ఎస్పీజీ భద్రత తొలగింపు
ఇక కొద్దిరోజుల క్రితం ఎస్పీజీ ప్రొటెక్షన్ను సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీలకు తీసివేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైన తొలినాలుగు రోజుల్లో సభను ఈ అంశం కుదిపేసింది. రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగంగానే గాంధీ కుటుంబానికి ప్రభుత్వం ఎస్పీజీ రక్షణను తీసివేసిందని కాంగ్రెస్ మండిపడింది. గాంధీ కుటుంబానికి, మాజీ ప్రధాని మన్మోహన్సింగ్కు తిరిగి ఎస్పీజీ రక్షణ కల్పించాలని డిమాండ్ చేసింది. రాజకీయాలను చేయడం మాని వెంటనే వారికి ఎస్పీజీ కవర్ ఇవ్వాలని సభలో కాంగ్రెస్ డిమాండ్ చేసింది.
28 ఏళ్ల తర్వాత గాంధీ కుటుంబానికి ఎస్పీజీ భద్రత తొలగింపు
మరో వైపు గాంధీ కుటుంబానికి 28 ఏళ్ల తర్వాత ఎస్పీజీ ప్రొటెక్షన్ను తీసివేశారు. సెప్టెంబర్ 1988లో ఎస్పీజీ చట్టం రాగా 1991 సెప్టెంబర్లో ఎస్పీజీ చట్టసవరణ చేస్తూ వీవీఐపీ సెక్యూరిటీ జాబితాలో గాంధీ కుటుంబాన్ని కూడా చేర్చింది. ఎస్పీజీ చట్టం వచ్చిన ప్రారంభంలో దేశ ప్రధాని , మాజీ ప్రధానులకు మాత్రమే ఎస్పీజీ ప్రొటెక్షన్ ఇచ్చేవారు. ఎస్పీజీ ప్రొటెక్షన్ ఉన్న వీవీఐపీలకు ప్రత్యేక భద్రతా సిబ్బంది, హైటెక్ వాహనాలు, జామర్లు ఉన్న వాహనంతో పాటు అంబులెన్స్ కూడా వారి కాన్వాయ్లో ఉంటుంది. ప్రస్తుతం ప్రధాని నరేంద్రమోడీకి మాత్రమే ఎస్పీజీ కమాండోలు ఉన్నారు.