ప్రధాని, మాజీ ప్రధానులకే ఎస్పీజీ.. ఐదేళ్లు కానీ ఆ మెలిక పెట్టిన మోడీ సర్కార్...
స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూపు (ఎస్పీజీ) భద్రత ఒక ప్రధానమంత్రికి మాత్రమేనని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పష్టంచేశారు. గాంధీ కుటుంబీలకు భద్రతను కుదించడంతో వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. దీనిపై బుధవారం లోక్సభలో అమిత్ షా మాట్లాడారు. 1988 నుంచి ప్రధానమంత్రి, మాజీ ప్రధానులకు ఎస్పీజీ భద్రత కల్పిస్తోంది. దానిని నరేంద్ర మోడీ సర్కార్ సవరిస్తోంది.
ఇక ప్రత్యేకం..
ఎస్పీజీ భద్రత ఇక స్పెషల్ అని, ఒక ప్రధానికే మాత్రమని అమిత్ షా పేర్కొన్నారు. పదవీకాలంలో ఉన్నన్నీ రోజులు ప్రధానీకి ఎస్పీజీ సిబ్బంది ప్రొటెక్షన్ ఇస్తారని తెలిపారు. ఈ మేరకు లోక్సభలో ఎస్పీజీ చట్టనవరణ బిల్లును అమిత్ షా ప్రవేశపెట్టారు. ఎస్పీజీ ఎవరికీ ఇస్తాం, మాజీ ప్రధానులు ఎక్కడుంటే భద్రత కల్పిస్తామనే అంశాలపై క్లారిటీ ఇచ్చారు.
వారికి కూడా.. కానీ
ప్రధాని నివాసంలో నివసించే వారికి కూడా భద్రత ఉంటుందని తెలిపారు. మాజీ ప్రధానులకు కూడా ఎస్పీజీ భద్రత కల్పిస్తామని అమిత్ షా పేర్కొన్నారు. ఐదేళ్ల వరకు ప్రొటెక్షన్ ఇస్తామని.. కానీ వారు ప్రభుత్వం కేటాయించిన గృహల్లో నివసించాలని మెలిక పెట్టారు. దీనిపై కాంగ్రెస్ నేత మనీశ్ తివారీ స్పందించారు.. ఇదే కారణంతో మాజీ ప్రధాని రాజీవ్గాంధీకి భద్రత కుదించారని పేర్కొన్నారు. దానికి కూడా ఇలానే మెలిక పెట్టి తొలగించారని పేర్కొన్నారు.
28 ఏళ్ల నుంచి
సోనియా, రాహుల్, ప్రియాంకలకు ఎస్పీజీ భద్రతను తొలగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. 1991లో మాజీ ప్రధాని రాజీవ్గాంధీ హత్య తర్వాత గాంధీ కుటుంబీకులకు ఎస్పీజీ భద్రతను కేంద్రం కల్పిస్తోంది. గత 28 సంవత్సరాల నుంచి భద్రత ఇస్తోంది. ఈ క్రమంలో మోడీ సర్కార్ ప్రొటెక్షన్ తగ్గించడంపై ఆ పార్టీ నేతలు భగ్గుమంటున్నారు.
ఆమడదూరంలో..
ప్రధాని పదవీ చేపట్టి ఐదేళ్లలోపు మాత్రమే అని మెలిక పెట్టడంతో సోనియాగాంధీ కుటుంబం ఎస్పీజీ భద్రతకు ఆమడ దూరంలో ఉండనుంది. రాజీవ్ గాంధీ తర్వాత ఆ కుటుంబం నుంచి ప్రధాని పదవీ చేపట్టలేదు. సోనియా, రాహుల్ గాంధీలకు అవకాశం వచ్చినా.. వారు పదవీ చేపట్టలేదు. మోడీ సర్కార్ తీసుకొచ్చిన కొత్త మెలికతో సోనియా కుటుంబానికి ఇక ఎస్పీజీ భద్రత ఇవ్వడం కుదరదని స్పష్టమవుతోంది.