ఇదీ జరిగింది.. విమానంలో ప్రజ్ఞాసింగ్ వివాదంపై స్పెస్ జెట్ క్లారిటీ
Recommended Video
ప్రముఖ విమానాయాన సంస్థ స్పైస్ జెట్ సిబ్బంది తనను అవమానించారంటూ భోపాల్ ఎంపీ ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ సింగ్ చేసిన ఆరోపణలపై ఆ సంస్థ వివరణ ఇచ్చింది. ఠాకూర్ వీల్ చైర్లో వచ్చినందున నాన్ ఎమర్జెన్సీ వరుసలో కూర్చోవాలని సిబ్బంది ఎంపీని కోరినట్టు తెలిపింది. అయితే అందుకు ఆమె నిరాకరించడమే కాకుండా మొదటి వరుసలోనే కూర్చుంటానని మొండి పట్టు పట్టడంతో విమానం 45 నిమిషాలు ఆలస్యంగా బయలుదేరినట్టు వెల్లడించింది.
ఢిల్లీ-భోపాల్ మధ్య నడిచే 78 సీట్ల సామర్థ్యం గల బొంబార్డియర్ Q400 స్పెస్ జెట్ విమానంలో ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్ తన టికెట్ బుక్ చేసుకున్నారు. ఈ ఎయిర్క్రాఫ్ట్లో మొదటి వరుస 'ఎమర్జెన్సీ వరుస' కావడంతో వీల్ చైర్ ప్రయాణికులకు దాన్ని కేటాయించరు.
అయితే ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ తన సొంత వీల్ చైర్లో వచ్చి మొదటి వరుసలో కూర్చోవడంతో సిబ్బంది అందుకు అభ్యంతరం చెప్పారు. నాన్ ఎమర్జెన్సీ వరుస 2 A/Bలోకి మారాల్సిందిగా కోరారు. అయితే ప్రజ్ఞా మాత్రం అక్కడి నుంచి కదిలేందుకు ససేమిరా అన్నారు. తోటి ప్రయాణికులు కూడా ఆమెను అడిగిచూసినప్పటికీ లాభం లేకుండా పోయింది.
భద్రతా ప్రమాణాలకు సంబంధించి ఎగ్జిట్ డోర్ పాలసీని చూపించాల్సిందిగా ప్రజ్ఞా కోరడంతో.. సిబ్బంది అందుకు సంబంధించిన డాక్యుమెంట్స్ ఆమె ముందుంచారు. వాటిని పరిశీలించిన ప్రజ్ఞా ఠాకూర్ ఎట్టకేలకు 45 నిమిషాల తర్వాత అక్కడి నుంచి నాన్ ఎమర్జెన్సీ వరుసలోకి మారారు. స్పెస్ జెట్ సిబ్బంది తనను అవమానించారంటూ ప్రజ్ఞా ఠాకూర్ ఆరోపణలు చేసిన ఒకరోజు తర్వాత ఆ సంస్థ ఇలా వివరణ ఇచ్చుకుంది.