వీడియో: స్పైస్జెట్ దుబాయ్ ఫ్లైట్: ల్యాండ్ అవ్వగానే పేలిన టైరు!
జైపూర్: ఎండాకాలంలో సాధారణంగా కార్లు, బస్సులు, ఇతర వాహనాలు టైర్లు ఢామ్మంటూ పేలిపోతుంటాయి. వాటి వల్ల ఘోర ప్రమాదాలు కూడా చోటు చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. దీనికి భిన్నంగా ఈ సారి విమానం టైరే పేలి పోయింది. ల్యాండ్ అయిన వెంటనే పెద్ద శబ్దం చేస్తూ పేలిపోయింది టైరు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు. ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారని స్పైస్జెట్ సంస్థ యాజమాన్యం వెల్లడించింది.
#WATCH: SpiceJet Dubai-Jaipur SG 58 flight with 189 passengers onboard made an emergency landing at Jaipur airport at 9:03 am today after one of the tires of the aircraft burst. Passengers safely evacuated. #Rajasthan pic.twitter.com/f7rjEAQt7M
— ANI (@ANI) June 12, 2019
స్పైస్జెట్ విమానయాన సంస్థకు చెందిన ఎస్జీ 58 రకం విమానం బుధవారం తెల్లవారు జామున దుబాయ్ నుంచి జైపూర్కు బయలుదేరింది. ఉదయం 9:03 నిమిషాలకు జైపూర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అయింది. రన్వేపై దిగీ దిగగానే విమానానికి చెందిన ఓ టైరు పెద్ద శబ్దం చేస్తూ పేలిపోయింది. ముక్కలైపోయింది. వెంటనే పైలెట్ల అప్రమత్తం అయ్యారు. విమానం ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ విభాగానికి సమాచారం అందించారు.
ల్యాండ్ అయిన సమయంలో విమానం వేగం గంటకు 200 కిలోమీటర్లుగా ఉన్నట్లు తేలింది. ఒక్కసారిగా బ్రేకులు వేసి, నిలిపివేస్తే మరిన్ని సమస్యలు తలెత్తుతాయనే ఉద్దేశంతో.. పేలిన టైరుతోనే కొంతదూరం ప్రయాణించిందా విమానం. దుబాయ్లో టేకాఫ్ తీసుకున్న వెంటనే విమానం టైరు పేలినట్లుగా గుర్తించారు. జైపూర్లో ల్యాండ్ అయ్యే సమయంలో ఏర్పడిన ఒత్తిడి, రాపిడికి అది ధ్వంసమైందని నిర్ధారించారు.