స్పైస్ జెట్ విమానం అత్యవసర ల్యాండింగ్...గుండెపోటుతో ప్రయాణికుడి మృతి
ఢిల్లీకి వెళ్లాల్సిన స్పెస్ జెట్ విమానంలో ఓ ప్రయాణికుడికి గుండెపోటు రావడంతో వారణాసిలో అత్యవసరంగా విమానాన్ని ల్యాండ్ చేయాల్సి వచ్చింది. హాస్పిటల్కు తీసుకెళుతుండగా మార్గమధ్యలోనే అతను మృతి చెందాడు. మృతి చెందిన ప్రయాణికుడు థాయ్లాండ్కు చెందిన వ్యక్తి. విమానం బ్యాంకాక్ నుంచి ఢిల్లీకి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకున్నట్లు లాల్బహదూర్ శాస్త్రి విమానాశ్రయం అధికారి అనిల్ కుమార్ రాయ్ చెప్పారు.
విమానం గాల్లో ఉండగా ప్రయాణికుడికి తీవ్ర గుండెపోటు రావడంతో విమానాన్ని అత్యవసరం ల్యాండింగ్ చేయించినట్లు చెప్పిన అనిల్ కుమార్ వెంటనే హాస్పిటల్కు తరలించినట్లు వెల్లడించారు. అయితే అప్పటికే ప్రయాణికుడు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. అతనిని థాయ్లాండ్ దేశస్తుడు అటావత్గా గుర్తించారు.
ఇదిలా ఉంటే స్పైస్ జెట్ SG 88 బ్యాంకాంక్ నుంచి ఢిల్లీ వస్తుండగా అత్యవసరంగా వారణాసిలో ల్యాండ్ చేయాల్సి వచ్చిందని స్పైస్ జెట్ అధికార ప్రతినిధి తెలిపారు.వారణాసిలో విమానం ల్యాండ్ అవగానే స్పైస్ జెట్ సిబ్బంది థాయ్ దేశస్తుడికి అన్ని విధాల సహకారం అందించారని చెప్పారు. ప్రయాణికుడికి గుండెపోటు వచ్చిందని వెంటనే అన్ని ఏర్పాట్లు చేయాలని వారణాసి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కు పైలెట్లు సమాచారం అందించారు. విమానం ల్యాండ్ అయిన వెంటనే సిబ్బంది ప్రయాణికుడిని హాస్పిటల్కు తరలించారని చెప్పారు.
ఎయిర్పోర్టు అధికారుల సమాచారం మేరకు ఆ విమానంలో 189 ప్రయాణికులున్నట్లు తెలుస్తోంది. ఇందులో 25 థాయ్ దేశస్తులున్నారని వెల్లడించింది. భారత కాలమాన ప్రకారం విమానం ఉదయం 8గంటలకు బ్యాంకాక్లో బయలుదేరింది. వారణాసి గగనతలంలో విమానం ఉండగా ప్రయాణికుడు అటావత్ పరిస్థితి విషమించిందని చెప్పారు.
దీంతో పైలెట్స్ ఏటీసీని సంప్రదించి ఎమర్జెన్సీ ల్యాండింగ్కు ఏర్పాటు చేయాల్సిందిగా కోరారని చెప్పారు. ఇక విమానం ల్యాండ్ అవగానే అటావత్కు మరో ఏడుగురు ప్రయాణికులు సహకరించినట్లు తెలిపారు. అనంతరం విమానం 181 మంది ప్రయాణికులతో మధ్యాహ్నం 12 గంటలకు ఢిల్లీకి బయలుదేరిందని ఎయిర్పోర్ట్ అధికారులు తెలిపారు.