'లెట్స్ గో అబ్రాడ్ సేల్': విదేశీ రూట్లలో రూ.2699కే స్పైస్ జెట్ ఆఫర్
న్యూఢిల్లీ: భారత్లోని విమానయాన సంస్ధల మధ్య 'టిక్కెట్ల ధర' పై పెద్ద యుద్ధమే జరుగుతుంది. నిన్నటి వరకు జాతీయ రూట్లలో కొనసాగిన తగ్గింపు ధరలు తాజాగా అంతర్జాతీయ రూట్లకు విస్తరించాయి.
తక్కువ ధరలకే విమాన టిక్కెట్లను ఆఫర్ చేస్తున్ స్పైస్ జెట్ గురువారం విదేశీ ప్రయాణికులకు అద్భుతమైన ఆఫర్ను ప్రకటించింది. కేవలం రూ. 2699లకే అంతర్జాతీయ రూట్లలో విమాన టిక్కెట్లను విక్రయించనుంది.
'లెట్స్ గో అబ్రాడ్ సేల్' తో ప్రారంభించి ఈ టిక్కెట్ల అమ్మకాలు మార్చి 19 నుంచి 22 మధ్య బుక్ చేసుకోవాలని, ప్రయాణ తేదీ మార్చి 19 నుంచి జూన్ 30 వరకు ఎంచుకోవచ్చని తెలిపింది. అయితే అంతర్జాతీయ గమ్యస్ధానాలకు వెళ్లే డైరెక్ట్ విమానాలకు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుందని తన ప్రకటనలో పేర్కొంది.
గత నెలలో రైలు చార్జీల కన్నా తక్కువ ధరకే స్పైస్ జెట్ సరికొత్త ఆఫర్ను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ఆఫర్ కింద దేశీయ విమానాల్లో వన్ వే చార్జీ రూ. 599(అన్ని ట్యాక్స్లు కలిపి)కే అందించింది. విదేశీ రూట్లలో కూడా టికెట్లు బుక్ చేసుకోవచ్చని (కొలంబో, కాబుల్, దుబాయ్- అహ్మదాబాద్ సర్వీసులు మినహా) ప్రకటించిన విషయం తెలిసిందే.
ఈ ఆఫర్ కింద చాలా మంది ప్రయాణీకులు హైదరాబాద్- విజయవాడ, ఢిల్లీ- డెహ్రాడూన్, గౌహతి- కోల్కతా, అహ్మదాబాద్- ముంబై, బెంగళూర్- హైదరాబాద్ మధ్య రూ. 599లకే వన్వే టికెట్ బుక్ చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఆఫర్ కోసం 4 లక్షల సీట్లను కంపెనీ కేటాయించింది.