టిక్కెట్లేవీ?: రూ.444 స్పైస్జెట్ ఆఫర్ జిమ్మిక్కా?
న్యూఢిల్లీ: స్పైస్ జెట్ ఎయిర్ వేస్ బుధవారం నాడు అద్భుతమైన ఆఫర్ ఇచ్చింది. రూ.444కే విమాన ప్రయాణ టిక్కెట్లు అంటూ ప్రకటించింది. అయితే, ఇది బోగస్ అని ప్రయాణికులు మండిపడుతున్నారు. ఈ ఆఫర్లో భాగంగా కనీస టికెట్లను కూడా విక్రయించలేదని ఆరోపిస్తున్నారు.
ఎయిర్ పాసింజర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఏపీఏఐ) డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్కు లేఖ రాసింది. ఈ తరహా తప్పుడు స్కీములను నిలిపి వేయాలని ప్రకటించింది.
కాగా, ఐదు రోజుల పాటు అందుబాటులో ఉండే రూ.444 టికెట్లను జూలై 1 నుంచి సెప్టెంబర్ 30 లోపు ప్రయాణించే వారు బుక్ చేసుకోవచ్చని స్పైస్ జెట్ ప్రకటించింది. ఎంపిక చేసిన మార్గాలలో ఇవి లభ్యమవుతాయని వెల్లడించింది. టికెట్ల కోసం ప్రయత్నించిన వారికి అవి లభించలేదంటున్నారు.
బొనాంజా సేల్: రూ.444కే స్పైస్జెట్ విమాన టికెట్!
బుధవారం నాడు స్పైస్ జెట్ ప్రకటన వెలువడిన అనంతరం ఉదయం పదిన్నర గంటల నుంచి తమ సభ్యుల నుంచి ఎన్నో ఫిర్యాదులు వచ్చాయని, తాము టికెట్లను పొందలేదని, 500 కి.మీ దూరంలోపు గమ్యస్థానాలకు సైతం స్పైస్ జెట్ టికెట్లను ఉంచలేదని తెలుస్తోందని ఏపీఏఐ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు చెప్పారు. ఇది స్పైస్ జెట్ గిమ్మిక్కు అని మండిపడ్డారు.