అదుపుతప్పిన స్పైస్ జెట్ విమానం.. ముంబై ఎయిర్పోర్టులో రన్ వే మూసివేత.. పలు ఫ్లైట్ల రద్దు..
ముంబై : భారీ వర్షాలకు ముంబై నగరం తడిసి ముద్దైంది. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలతో జనం నానా ఇబ్బందులు పడుతున్నారు. ప్రతికూల వాతావరణం ప్రభావం పలు విమాన సర్వీసులపై పడింది. ఇదిలా ఉంటే వర్షాల కారణంగా సోమవారం రాత్రి స్పైస్ జెట్ విమానానికి పెను ప్రమాదం తప్పింది. ముంబైలోని ఛత్రపతి శివాజీ ఎయిర్పోర్టులోని మెయిన్ రన్ వేపై స్పైస్ జెట్ ఫ్లైట్ అదుపు తప్పింది.
మునిగిపోయిన ముంబై.. స్తంభించిన మహానగరం.. భారీ వర్షాలకు 19 మంది బలి..
జయపుర నుంచి ముంబైకి చేరుకున్న బోయింగ్ 737-800 విమానం ల్యాండయ్యే సమయంలో రన్ వే చివరకు దూసుకుపోయి బురదలో కూరుకుపోయింది. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. ఘటన జరిగిన వెంటనే అప్రమత్తమైన సిబ్బంది ప్రయాణీకులను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. మెయిన్ రన్వేను మూసివేసిన అధికారులు మరో రన్వే పై రాకపోకలు సాగిస్తున్నారు.
ప్రమాదానికి గురైన స్పైస్ జెట్ విమానం ఇంకా రన్ వే పైనే ఉండటంతో ఆ రన్ వేను పూర్తిగా మూసివేశారు. దీనికి తోడు కుండపోత వర్షాలు కురుస్తుండటంతో పలు విమాన సర్వీసులు రద్దయ్యాయి. దాదాపు 54 ఫ్లైట్లను బెంగళూరు, అహ్మదాబాద్కు మళ్లించారు. దేశీయ ఎయిర్లైన్ కంపెనీలు ఫ్లైట్ల రద్దు సమాచారాన్ని సోషల్ మీడియా ద్వారా ఎప్పటి కప్పుడు ప్రయాణీకులకు తెలియజేస్తున్నాయి. ముంబై నుంచి ఎయిర్ విస్తారాకు చెందిన 10 విమానసర్వీసులు రద్దు అయినట్లు ఆ సంస్థ ప్రకటించింది.