షిర్డీ ఎయిర్ పోర్ట్లో స్పైస్ జెట్ విమాన ప్రమాదం! ప్రయాణికులు సేఫ్
ముంబై: మహారాష్ట్రలోని ప్రముఖ్య పుణ్యక్షేత్రం షిర్డీ విమానాశ్రయంలో ప్రమాదకర ఘటన చోటు చేసుకుంది. స్పైస్ జెట్ విమానయాన సంస్థకు చెందిన విమానం సోమవారం సాయంత్రం ప్రమాదానికి గురైంది. రన్ వే నుంచి పక్కకు జారిపోయింది. విమానం ల్యాండ్ అయ్యే సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో కొందరు ప్రయాణికులు స్వల్పంగా గాయపడినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదం సందర్భంగా రన్ వే దెబ్బతినడం వల్ల విమానాల రాకపోకలను నిలిపివేశారు. షిర్డీ చేరుకోవాల్సిన విమానాలను దారి మళ్లించారు.
ముంబై నుంచి స్పైస్ జెట్ 945 రకానికి చెందిన బోయింగ్ 737 విమానం మధ్యాహ్నం షిర్డీకి చేరుకుంది. ల్యాండ్ అయ్యే సమయంలో విమానం అదుపు తప్పింది. రన్ వే మీది నుంచి జారిపోయింది. సుమారు 50 నుంచి 60 మీటర్ల వరకు పక్కకు జారింది. అత్యంత వేగంగా రన్ వే నుంచి పక్కకు జారిపోవడం వల్ల విమానం పెద్ద ఎత్తున కుదుపులకు లోనైనట్లు చెబుతున్నారు. ఫలితంగా- విమానంలో ఉన్న ప్రయాణికులు కొందరు స్వల్పంగా గాయపడ్డారని సమాచారం. గతుకుల రోడ్లపై అతి వేగంగా ప్రయాణించడం వల్ల విమానం ముందు భాగం కూడా సుమారు 30 శాతం మేర ధ్వంసమైనట్లు తెలుస్తోంది.
ఈ ఘటన చోటు చేసుకున్న వెంటనే- అక్కడి గ్రౌండ్ స్టాఫ్ సంబంధిత అధికారులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న వెంటనే అధికారులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. ప్రయాణికులను సురక్షితంగా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ముందుజాగ్రత్త చర్యగా అంబులెన్స్, అగ్నిమాపక శకటాలను అందుబాటులో ఉంచారు. విమానాన్ని మళ్లీ రన్ వే మీదికి తీసుకుని రావడానికి చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదం వల్ల రన్ వే కొంత భాగం ధ్వంసమైంది. దీనితో విమానాల రాకపోకలను విమానాశ్రయ అధికారులు నిలిపివేశారు. షిర్డీకి చేరుకోవాల్సిన విమానాలను దారి మళ్లిస్తున్నారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా అందాల్సి ఉంది.