కొత్త కేసులతో కల్లోలం: ఒక్కరోజే వెయ్యి మందికి పైగా బలి: రెండోసారి రికార్డు స్థాయిలో మరణాలు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. లక్షలాదిమందిని ఆసుపత్రుల పాలు చేసిన కరోనా వైరస్ వేలాది మందిని బలి తీసుకుంటోంది. కరోనా మహమ్మారి ఇప్పట్లో బలహీనపడేలా కనిపించట్లేదు. సరికొత్త వెల్లువను సృష్టిస్తోంది. రికార్డు స్థాయిలో కరోనా వైరస్ రోజువారీ పాజిటివ్ కేసులు వెలుగులోకి వస్తున్నాయి.. వస్తూనే ఉన్నాయి. దీనికి అనుగుణంగా మరణాల సంఖ్యలో కూడా భారీగా పెరుగుదల కనిపించింది. ఒక్కరోజే వెయ్యిమందికి పైగా కరోనా వల్ల మృత్యువాత పడ్డారు. రోజువారీ కరోనా మరణాలు వెయ్యిని దాటుకోవడం ఇదే రెండోసారి కావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.
తెలంగాణ..తగ్గుముఖం పట్టని కరోనా: కొత్తగా మరిన్ని కేసులు: రెండు వేలకు టచ్
వెయ్యి మందికి పైగా రెండోసారి..
దేశవ్యాప్తంగా 24 గంటల వ్యవధిలో కొత్తగా 64,553 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 1,007 మంది మరణించారు. దీనితో ఇప్పటిదాకా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 24,61,191కి చేరుకుంది. మరణాల సంఖ్య 48 వేలను దాటుకుంది. ఇప్పటిదాకా 48,040 మంది మృత్యువాత పడ్డారు. దీనికి సంబంధించిన వివరాలతో కూడిన తాజా బులెటిన్ను కొద్దిసేపటి కిందటే కేంద్ర వైద్య మంత్రిత్వ శాఖ అధికారులు విడుదల చేశారు. దేశవ్యాప్తంగా యాక్టివ్ కేసుల సంఖ్య 6,61,595కు చేరుకుంది. డిశ్చార్జి అయిన వారి సంఖ్య 17,51,556గా నమోదైంది.
ఒక్కరోజులో 8 లక్షలకు పైగా..
దేశంలో ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) సారథ్యంలో కొనసాగుతోన్న కరోనా వైరస్ శాంపిళ్ల పరీక్షలు విస్తృతంగా కొనసాగుతున్నాయి. రోజువారీ శాంపిళ్ల టెస్టుల్లో ఐసీఎంఆర్ మరోసారి రికార్డును నమోదు చేసింది. గురువారం ఒక్కరోజే 8,48,728 శాంపిళ్లను పరీక్షించినట్లు ఐసీఎంఆర్ వెల్లడించింది. ఇప్పటిదాకా 2,76,94,416 శాంపిళ్లను పరీక్షించినట్లు ఐసీఎంఆర్ పేర్కొంది. కరోనా వైరస్ టెస్టింగులను వేగవంతం చేయడానికి దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు ల్యాబొరేటరీలను కేంద్రం ఏర్పాటు చేసింది.
ఆ నాలుగు రాష్ట్రాల్లో విధ్వంసకరంగా కరోనా..
కరోనా వైరస్ నాలుగు రాష్ట్రాల్లో విధ్వంసాన్ని సృష్టిస్తోంది. వేలాదిమందిని పొట్టనబెట్టుకుంటోంది. మహారాష్ట్ర, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకల్లో వేల సంఖ్యలో కరోనా వైరస్ రోజువారీ పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఆందోళనకరంగా పరిణమించాయి. తాజాగా అస్సాం కూడా ఈ జాబితాలో చేరుతోంది. అస్సాంలో రికార్డు స్థాయిలో ఒక్కరోజే 4593 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కరోనా వైరస్ వ్యాప్తి చెందడం ఆరంభమైనప్పటి నుంచి అస్సాంలో ఒక్కరోజులో ఈ స్థాయిలో కేసులు రికార్డు కావడం ఇదే తొలిసారి. ఇదివరకు అత్యధికంగా 24 గంటల్లో మూడువేల కేసులు నమోదు అయ్యాయి.
మహారాష్ట్రలో ఒక్కరోజే 413 మరణాలు
మహారాష్ట్రలో కరోనా కరాళ పరిస్థితులు ఏ మాత్రం తగ్గట్లేదు. ఆరంభంలో ఎలాంటి వేగం కరోనా కేసుల పెరుగుదలలో చోటు చేసుకుందో.. ఇప్పుడూ అదే తరహా పరిస్థితులు నెలకొన్నాయి. మరింత వేగాన్ని పుంజుకున్నాయి. మహారాష్ట్రంలో 24 గంటల వ్యవధిలో 413 మంది మరణించారు. ఒక్కరోజు వ్యవధిలో ఇప్పటిదాకా నమోదైన మరణాల్లో ఇదే అత్యధికం కావడం గుబులు రేపుతోంది. కరోనా వైరస్ పాజిటివ్ కేసులను గానీ, మరణాలను గానీ నియంత్రించడంలో ప్రభుత్వాలు తీసుకుంటోన్న చర్యలు ఆశించిన ఫలితాలను ఇవ్వట్లేదనేది స్పష్టమౌతోంది.
అమెరికా తరువాత భారత్..
అమెరికాలోని జాన్ హాప్కిన్స్ యూనివర్శిటీ డేటా ప్రకారం.. కరోనా వైరస్ యాక్టివ్ కేసుల్లో ప్రపంచ దేశాల్లో భారత్ రెండోస్థానానికి చేరుకుంది. అమెరికా తరువాత ఆ స్థాయిలో కరోనా యాక్టివ్ కేసులు నమోదు చేసిన దేశం భారతేనని ఈ డేటా స్పష్టం చేస్తోంది. ఇప్పటిదాకా యాక్టివ్ కేసుల సంఖ్యలో బ్రెజిల్ రెండో స్థానంలో కొనసాగింది. యాక్టివ్ కేసుల సంఖ్యలో భారత్.. బ్రెజిల్ను వెనక్కి నెట్టేసింది. అయినప్పటికీ జులై రెండో సగంతో పోల్చుకుని చూస్తే.. ఆగస్టు ఫస్ట్ ఆఫ్లో యాక్టివ్ కేసుల సంఖ్యలో స్వల్పంగా వేగం మందగించింది.