పాతిక లక్షలకు పైగా కేసులు: అరలక్షకు చేరువగా మరణాలు: కరోనా కరాళ నృత్యం
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ మరింత విజృంభిస్తోంది. లక్షలాదిమందిని ఆసుపత్రుల పాలు చేసిన కరోనా వైరస్ వేలాది మందిని బలి తీసుకుంటోంది. కరోనా మహమ్మారి ఇప్పట్లో బలహీనపడేలా కనిపించట్లేదు. సరికొత్త వెల్లువను సృష్టిస్తోంది. రికార్డు స్థాయిలో కరోనా వైరస్ రోజువారీ పాజిటివ్ కేసులు వెలుగులోకి వస్తున్నాయి.. వస్తూనే ఉన్నాయి. దీనికి అనుగుణంగా మరణాల సంఖ్యలో కూడా భారీగా పెరుగుదల కనిపించింది. వరుసగా రెండోరోజు కూడా వెయ్యికి చేరువగా మరణాలు నమోదు అయ్యాయి. 24 గంటల వ్యవధిలో 996 మంది మృత్యువాత పడ్డారు. మొత్తం కేసులు పాతిక లక్షలను దాటేశాయి.
తెలంగాణలో 90 వేలను దాటిన కరోనా కేసులు: 23 వేలమందికి పైగా చికిత్స: రికవరీ రేటులో
65 వేలకు పైగా కొత్త కేసులు..
దేశవ్యాప్తంగా 24 గంటల వ్యవధిలో కొత్తగా 65,002 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 996 మంది మరణించారు. దీనితో ఇప్పటిదాకా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 25,26,193కు చేరుకుంది. మరణాల సంఖ్య 49 వేలను దాటింది. ఇప్పటిదాకా 49,036 మంది మరణించారు. దీనికి సంబంధించిన వివరాలతో కూడిన తాజా బులెటిన్ను కొద్దిసేపటి కిందటే కేంద్ర వైద్య మంత్రిత్వ శాఖ అధికారులు విడుదల చేశారు. దేశవ్యాప్తంగా యాక్టివ్ కేసుల సంఖ్య 6,68,220కి చేరుకుంది. డిశ్చార్జి అయిన వారి సంఖ్య 18,08,937గా నమోదైంది. మహారాష్ట్ర, తమిళనాడు, ఏపీ, కర్ణాటకల్లో ఓ వెల్లువలా రోజువారీ కరోనా కేసులు వెలుగులోకి వస్తున్నాయి.
వరుసగా రెండోరోజూ ఎనిమిది లక్షలకు పైగా..
దేశంలో ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) సారథ్యంలో కొనసాగుతోన్న కరోనా వైరస్ శాంపిళ్ల పరీక్షలు విస్తృతంగా కొనసాగుతున్నాయి. రోజువారీ శాంపిళ్ల టెస్టుల్లో ఐసీఎంఆర్ మరోసారి రికార్డును నమోదు చేసింది. శుక్రవారం ఒక్కరోజే 8,68,679 శాంపిళ్లను పరీక్షించినట్లు ఐసీఎంఆర్ వెల్లడించింది. వరుసగా రెండోరోజు కూడా ఎనిమిది లక్షలకు పైగా కరోనా పరీక్షలు నమోదు అయ్యాయి. ఇప్పటిదాకా 2,85,63,095 శాంపిళ్లను పరీక్షించినట్లు ఐసీఎంఆర్ పేర్కొంది. కరోనా వైరస్ టెస్టింగులను వేగవంతం చేయడానికి దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు ల్యాబొరేటరీలను కేంద్రం ఏర్పాటు చేసింది.
ఆ నాలుగు రాష్ట్రాల్లో విధ్వంసకరంగా కరోనా..
కరోనా వైరస్ నాలుగు రాష్ట్రాల్లో విధ్వంసాన్ని సృష్టిస్తోంది. వేలాదిమందిని పొట్టనబెట్టుకుంటోంది. మహారాష్ట్ర, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకల్లో వేల సంఖ్యలో కరోనా వైరస్ రోజువారీ పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఆందోళనకరంగా పరిణమించాయి. తాజాగా అస్సాం కూడా ఈ జాబితాలో చేరుతోంది. అస్సాంలో రికార్డు స్థాయిలో ఒక్కరోజే 4593 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కరోనా వైరస్ వ్యాప్తి చెందడం ఆరంభమైనప్పటి నుంచి అస్సాంలో ఒక్కరోజులో ఈ స్థాయిలో కేసులు రికార్డు కావడం ఇదే తొలిసారి. ఇదివరకు అత్యధికంగా 24 గంటల్లో మూడువేల కేసులు నమోదు అయ్యాయి.
Recommended Video