పెళ్లి వివాదం: తమ్ముడిపై అక్కాచెల్లెళ్ల హత్యాయత్నం
వివరాల్లోకి వెళితే.. మణికంఠన్(32) అనే యువకుడు తన ఇద్దరు అక్కలు మహాదేవి(38), నిర్మలా దేవి(36)లతో కలిసి ఉంటున్నాడు. వీరి తల్లి మరణించడంతో తండ్రి మంగళనాథన్ మరో మహిళను వివాహం చేసుకొని వేరుగా ఉంటున్నాడు. దీంతో తన అక్కలతోపాటు మణికంఠన్ ఉంటున్నాడు.
అక్కలిద్దరికీ ఇంకా వివాహం కాలేదు. ఇటీవల తాను వివాహం చేసుకోవాలని మణికంఠన్ భావించాడు. ఈ విషయాన్ని అక్కలకు తెలపడంతో వారు అందుకు నిరాకరించారు. దీంతో ఆదివారం వారి ముగ్గురి మధ్యా వివాదం జరిగింది. కోపంతో ఇంటి నుంచి వెళ్లిపోయిన మణికంఠన్, కొద్ది సేపటికి తిరిగి వచ్చాడు. మళ్లీ అతనితో అక్కలిద్దరు వాగ్వాదానికి దిగారు.
మాటా మాటా పెరగడంతో ఇద్దరు అక్కలు మణికంఠను ఇనుపరాడ్డుతో బలంగా తలపై కొట్టి, గొంతు కోశారు. తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చేరిన మణికంఠన్ చికిత్స పొందుతున్నాడు. ఆ తర్వాత భయాందోళనకు గురైన అక్కలిద్దరూ జైలుకు వెళ్లాల్సి వస్తుందని గొంతుకోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించారు.
సమాచారం అందుకున్న పోలీసులు మృతుడి ఇంటికి వెళ్లగా.. అప్పటికే నిర్మలాదేవి మృతి చెందింది. అపస్మారక స్థితిలో ఉన్న మహాదేవిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. మణికంఠన్, మహాదేవి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని పోలీసులు చెప్పారు. ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్న మణికంఠన్ ఇద్దరు అక్కలను పోషిస్తున్నాడని తెలిపారు. కాగా, ఘటన విషయం తెలిసిన బాధితుల తండ్రి మంగళనాథన్ ఆస్పత్రికి చేరుకున్నాడు.