హిమాలయాలకు వెళ్లిపోయిన సూపర్ స్టార్ రజనీకాంత్, బాబాజీ గుహల్లో ధ్యానం, రాజకీయాల్లో!
చెన్నై: సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్ హిమాలయాల్లో ధ్యానం చెయ్యడానికి వెళ్లారు. శనివారం సూపర్ స్టార్ రజనీకాంత్ చెన్నై నుంచి విమానంలో సిమ్లాలకు బయలుదేరి వెళ్లారు. ఈ సందర్బంగా చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడిన రజనీకాంత్ దేశ ప్రజలకు అంతా మంచి జరుగుతుందని అన్నారు.
బాబాజీ గుహలో 15 రోజులు
చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడిన సూపర్ స్టార్ రజనీకాంత్ 10 నుంచి 15 రోజుల పాటు తాను హిమాలయాల్లోని బాబాజీ గుహలో ధ్యానం చేస్తానని, తమిళనాడు ప్రజలతో పాటు దేశ ప్రజలు అందరూ క్షేమంగా ఉండాలని ప్రార్థనలు చేస్తానని అన్నారు.
రజనీకాంత్ వెంట!
సూపర్ స్టార్ రజనీకాంత్ వెంట ఆయనకు అత్యంత సన్నిహితులు అయిన కొందరు హిమాలయాలకు వెళ్లారు. రజనీకాంత్ కు తోడుగా, ఆయనకు కావలసిన సౌకర్యాలు చూసుకోవడానికి ఆయన సన్నిహితులు వెళ్లారని తెలిసింది.
చాల సంవత్సరాలు
చాల సంవత్సరాల తరువాత రజనీకాంత్ హిమాలయాల పర్యటనకు శ్రీకారం చుట్టారు. బాబా సినిమా ప్రారంభం కాకముందు రజనీకాంత్ హిమాలయాలకు వెళ్లి వచ్చారు. తరువాత రజనీకాంత్ హిమాలయాల పర్యటన చెయ్యలేదని ఆయన సన్నిహితులు తెలిపారు.
రాజకీయాల్లోకి!
రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే రాజకీయాల్లోకి వస్తున్నానని ప్రకటించిన సూపర్ స్టార్ రజనీకాంత్ పార్టీ పేరు, సిద్దాంతాలు కటించలేదు. రాజకీయ రంగప్రవేశం చేసే ముందు రజనీకాంత్ హిమాలయాల పర్యటకు శ్రీకారం చుట్టారు.
హిమాలయాల్లో ఉంటారా!
రజనీకాంత్ హిమాలయాలకు వెళ్లి వస్తే అధికారంలోకి వచ్చేస్తారా ? అంటూ తమిళనాడుకు పలువురు నేతలు ఎద్దేవ చేస్తున్నారు. సినిమాల్లో నటించిన సులభంగా రాజకీయాల్లో ఎదగలేరని, సినిమాలు, రాజకీయాలకు ఎంతో తేడా ఉందని అంటున్నారు.