బీహార్లో మారుతున్న రాజకీయ సమీకరణాలు: యాదవ సామాజిక వర్గం లాలూతోనే ఉన్నారా..?
బీహార్లో లోక్సభ ఎన్నికలు చాలా ఆసక్తికరంగా మారాయి. గడిచిన ఎన్నికలకు ఈ సారి ఎన్నికలకు చాలా వ్యత్యాసం ఉంది. ఆ వ్యత్యాసం మరేదో కాదు.. గడిచిన ఎన్నికలన్నిటిలో ఆర్జేడీ అధినేత లాలూ తన చాణక్యతను ఉపయోగించారు. ఈ సారి ఎన్నికలకు మాత్రం ఆయన ప్రత్యక్షంగా పాల్గొనలేకపోవడంతో బీహార్లో ఎలక్షన్స్ రంజుగా మారాయి.
యాదవ సామాజిక వర్గం ఎటువైపు..?
బీహార్... ఈ రాష్ట్రం పేరు వినగానే రాజకీయంగా గుర్తుకు వచ్చే పేరు ఆర్జేడీ అధినేత ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్. బీహార్లో ఎన్నికలు అంటే లాలూ చాణక్యత స్పష్టంగా కనిపించేది. కానీ ఈ సారి ఆర్జేడీకి లాలూ ప్రత్యక్షంగా సలహాలు సూచనలు చేసే వీలు లేకపోవడంతో ఆ పార్టీకి కాస్త కష్టకాలమే నడుస్తోంది. లాలూ జైలులో ఉన్నప్పటికీ పార్టీని తన భుజాల మీద వేసుకుని నడిపిస్తున్నారు ఆయన చిన్న కుమారుడు తేజస్వీ యాదవ్. ఇక లాలూ ప్రసాద్ యాదవ్ జైలుకు పరిమితం కావడంతో ఇప్పుడు ఆయన సొంత సామాజిక వర్గం యాదవ సామాజిక వర్గం అతనితోనే ఉందా అనే అనుమానం వ్యక్తం అవుతోంది.
బీహార్ జనాభాలో 14శాతం యాదవ సామాజికవర్గం వారు
1990 నుంచి యాదవ సామాజిక వర్గం లాలూ వెంటే నడిచారు. బీహార్ జనాభాలో ఆ సామాజిక వర్గం 14శాతంగా ఉంది. యాదవ సామాజిక వర్గంతో పాటు ముస్లిం సామాజిక వర్గం వారు కూడా ఆర్జేడీకి అండగా నిలుస్తూ వచ్చారు. ఇక 2014లోక్సభ ఎన్నికల్లో లాలూ సామాజిక వర్గంపై బీజేపీ కాస్త పట్టుసాధించినట్లు కనిపించింది. ఈ లోక్సభ ఎన్నికల్లో యాదవ సామాజిక వర్గం ఓట్లను బీజేపీ మరింత దక్కించుకునే అవకాశం ఉన్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఒక సామాజిక వర్గంలోని వారు చాలామంది పలురకాలుగా ఆలోచిస్తున్నారని బీహార్ ప్రజలు చెబుతున్నారు. మహాగట్భంధన్తో పొత్తులో భాగంగా ఆర్జేడీ తమ అభ్యర్థులను 19 చోట్ల నిలబెట్టింది. మహదేవ్పురాలో శరద్ యాదవ్ పోటీచేస్తుండగా... పాటలీపుత్రలో లాలూ కుమార్తె మిసా భారతీ పోటీ చేశారు.వీరిపై ఎన్డీఏ తరపున దినేష్ చంద్రయాదవ్, రామ్ కృపాల్ యాదవ్లు పోటీచేశారు. ఉజియాపూర్, మధుబనిలో ఆర్జేడీ యాదవేతర నేతలను బరిలో నిలుపగా... బీజేపీ మాత్రం అక్కడ ఆ రాష్ట్ర బీజేపీ చీఫ్ నిత్యానంద రాయ్, అశోక్ యాదవ్లను బరిలో నిలిపింది. అయితే అక్కడి యాదవ సామాజిక వర్గం తమకే ఓట్లు వేశారనే విశ్వాసాన్ని వీరు వ్యక్తం చేస్తున్నారు.
మానేర్లో లక్ష యాదవ సామాజిక వర్గం ఓట్లు
ఇక పాటలిపుత్ర నియోజకవర్గంలోని మానేర్లో అత్యధిక శాతం యాదవులు ఉన్నారు. ఈ నియోజకవర్గం నుంచి లాలూ కుమార్తె మీసా భారతి బరిలో నిలిచారు. ఈ సీటు లాలూకు చాలా కీలకం. ఈ సీటు గెలిస్తే లాలూకు తన సామాజికవర్గంపై ఇంకా పట్టుందనే అనుకోవాలి. లాలూ కుమార్తెను కేంద్రమంత్రి రామ్ కృపాల్ యాదవ్పై పోటీకి పెట్టింది ఆర్జేడీ. రామ్ కృపాల్ ఒకప్పుడు లాలూకు అత్యంత సన్నిహితుడు. ఇక మానేర్ అసెంబ్లీ సెగ్మెంట్లో యాదవ సామాజిక వర్గానికి చెందిన ఓట్లు దాదాపు లక్ష ఉండగా ఈ ఒక్క నియోజకవర్గంలోనే 50వేల మెజార్టీ ఆర్జేడీకి వచ్చేది. అయితే ఈసారి అది రిపీట్ అవుతుందా లేదా అనేది వేచి చూడాలి. ప్రచారంలో మాత్రం మీసా భారతి తన తండ్రి లాలూ పేరును పదే పదే ప్రస్తావిస్తూ వస్తున్నారు. నామినేషన్ వేసే సమయంలో కూడా లాలూ ప్రసాద్ యాదవ్ ఫోటోను తీసుకెళ్లారు. లాలూ పేరు ఎత్తకుండా ఆమె ప్రసంగం ముగించేవారు కాదు. అదే సమయంలో రామ్ కృపాల్ యాదవ్ ఒక అవకాశవాదిగా ఆమె అభివర్ణించారు.
యాదవ సామాజిక వర్గాన్ని మచ్చిక చేసుకునే పనిలో బీజేపీ
యాదవుల ఓట్లపై బీజేపీ కూడా కన్నేసింది. ఇది ఇప్పటి విషయం కాదు. 2013లో అప్పటి ప్రధాని అభ్యర్థిగా బీహార్లో పర్యటించినప్పుడు నరేంద్ర మోడీ యాదవులను మచ్చిక చేసుకునే ప్రయత్నం చేశారు. తాను యాదవుల ఓట్లు అడిగేందుకు అర్హుడినని ఎందుకంటే తాను పుట్టిన ద్వారకా గడ్డ యాదవులకు చెందినదే అని చెప్పుకొచ్చారు. ద్వారకానగరం కృష్ణుడి పుట్టినచోటని పురాణాలు చెబుతాయి. ఇలా 2014లో కొన్ని యాదవ సామాజిక ఓట్లు బీజేపీకి మల్లాయి. అయితే 2015లో మాత్రం నితీష్-లాలూ పార్టీలు కలిసి పోటీ చేసినందున తిరిగి ఆ ఓటర్లు వీరికే పట్టం కట్టారు.అయితే ఈ సారి మాత్రం బీజేపీ తమ అభ్యర్థులను చాలా జాగ్రత్తగా ఎంపిక చేసింది.