జడ్జీల మధ్య కుదరని ఏకాభిప్రాయం...పళని ప్రభుత్వానికి తాత్కాలిక ఊరట
చెన్నై: తమిళనాడులో పళని ప్రభుత్వానికి తాత్కాలిక ఉపశమనం లభించింది. ఎమ్మెల్యే టీటీవీ దినకరన్ వర్గానికి చెందిన 18 మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై మద్రాస్ హైకోర్టు తీర్పు వెలువరిచింది. అయితే ఇద్దరు న్యాయమూర్తుల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో 18 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలపై అనర్హత వేటు కొనసాగుతోంది.
గతేడాది పళని స్వామి ప్రభుత్వంపై జరిగిన విశ్వాస పరీక్ష సందర్భంగా దినకరన్ వర్గానికి చెందిన 18 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయడం జరిగింది. దీంతో ఎమ్మెల్యేలు హైకోర్టును ఆశ్రయించారు. తుది తీర్పు వెల్లడయ్యేవరకు 18 మంది ఎమ్మెల్యేలపై ప్రస్తుత పరిస్థితినే కొనసాగించాలని కోర్టు తెలిపింది. అయితే గురువారం తుది తీర్పు వెల్లడించింది కోర్టు. ఇద్దరు జడ్జీల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. ప్రధాన న్యాయమూర్తి ఇందిరా బెనర్జీ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు సరైనదే అంటూ తీర్పు ఇవ్వగా రెండో జడ్జీ ఇందుకు అంగీకరించలేదు. దీంతో తీర్పును మూడో జడ్జికి బదిలీ చేయడం జరిగింది.
234 మంది ఉన్న తమిళనాడు అసెంబ్లీలో స్పీకర్ మినహాయిస్తే అన్నాడీఎంకేలో 116 మంది సభ్యులున్నారు. అయితే ఇప్పుడు 18 మంది ఎమ్మెల్యేలపై కొనసాగుతున్న అనర్హత వేటును రద్దు చేస్తే పళని స్వామి ప్రభుత్వం కుప్పకూలుతుంది. ఈ 18 ఎమ్మెల్యేలు శశికళ - దినకరన్ వర్గాలకు మద్దతుగా నిలుస్తున్న వారు కావడం విశేషం. ఇదిలా ఉంటే ఈ మధ్యే మరో ముగ్గురు ఎమ్మెల్యేలు దినకరన్కు మద్దతును తెలపడంతో 116గా ఉన్న ఎమ్మెల్యేల సంఖ్య కాస్త 113కు చేరింది. అంటే మ్యాజిక్ ఫిగర్కు నలుగురు సభ్యుల మద్దతు తక్కువగా ఉంది. మరోవైపు విపక్ష పార్టీ డీఎంకేకు 89 మంది సభ్యులుండగా... దినకరన్ ఒక్కరే స్వతంత్ర అభ్యర్థిగా ఉన్నారు.
అనర్హత వేటు కొనసాగినంత వరకు పళని ప్రభుత్వానికి ఎలాంటి అపాయమూ లేదు. ఎందుకంటే అనర్హత వేటుతో అసెంబ్లీ సంఖ్య 215కు చేరుకుంది.అదే సమయంలో 18 స్థానాలకు ఎన్నికల జరగాల్సి ఉన్న నేపథ్యంలో పళని ప్రభుత్వం అంత సులభంగా ఊపిరి తీసుకోలేని పరిస్థితి ఏర్పడింది.