కూలిన వేదిక: కిందపడిన కేంద్రమంత్రికి గాయాలు
దిబ్రూఘర్: భారతీయ జనతా పార్టీ సోమవారం నిర్వహించిన ఓ సభలో అపశృతి చోటుచేసుకుంది. బిజెపికి చెందిన యువమోర్చా ఓ కార్యక్రమం నిర్వహిస్తుండగా దానికి సంబంధించిన వేదిక కూలిపోయి కేంద్ర క్రీడాశాఖమంత్రి సర్బానంద సోనోవాల్తో సహా 15 మంది గాయాలపాలయ్యారు.
అస్సాంలోని బిజెపి అనుభంద శాఖ అయిన బీజేపీ యువ మోర్చా (బీజేవైఎం) కార్యకర్తలు సోమవారం కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. ఇందుకోసం 25 మంది అతిథులు ఆసీనులయ్యేలా వేదికను ఏర్పాటు చేశారు.
దీనికి కేంద్ర క్రీడాశాఖ మంత్రి శర్వానంద సోనోవాల్, బిజెపి సీనియర్ నేత ఉజ్వల్ కశ్యప్, ఎంపీలు కామాఖ్య ప్రసాద్, రామేశ్వర్ తేలి హాజరయ్యారు. కాగా, ఒక్కసారిగా వేదిక మీదకు పరిమితికి మించి రెట్టింపుగా దాదాపు 150 మంది ఎక్కారు.
వీరంతా కార్యక్రమానికి వచ్చిన కేంద్ర క్రీడాశాఖ మంత్రి సర్బానంద సోనోవాల్కు అభినందనలు తెలిపేందుకు ఎగబడ్డారు. దీంతో అది ఒక్కసారిగా కుప్పకూలింది. వేదికపైన నేతలు స్వల్ప గాయాలపాలయ్యారు. వెంటనే అక్కడికి వైద్యులు చేరుకొని ప్రథమ చికిత్సలు అందించారు.