డిమాండ్ చేసేందుకు నేనెవర్ని: 'పద్మ'పై సైనా, గుత్తా జ్వాలా సూచన
న్యూఢిల్లీ: తాను పద్మ అవార్డు కోసం డిమాండ్ చేయలేదని స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ సోమవారం వివరణ ఇచ్చారు. తాను పద్మభూషణ్ కోసం డిమాండ్ చేయలేదని, తన పేరును ఎందుకు పరిగణలోకి తీసుకోలేదో మాత్రమే ప్రశ్నించానని ఆమె చెప్పారు.
తాను పద్మభూషణ్ కోసం డిమాండ్ చేసినట్లుగా ఎందుకు చెబుతున్నారో తనకు అర్థం కావడం లేదన్నారు. అవార్డు కోసం డిమాండ్ చేయడానికి అసలు నేనెవరిని అని ప్రశ్నించారు. అసలు తన పేరును ఎందుకు ప్రతిపాదించలేదో తెలుసుకునే ప్రయత్నం మాత్రమే చేశానని సైనా చెప్పారు.
మరోవైపు, క్రీడా మంత్రిత్వ శాఖ పద్మ భూషణ్కు తన పేరును సిఫార్సు చేయడంపై సైనా హర్షం వ్యక్తం చేశారు. దేశం కోసం తనవంతుగా ఆడానని, అవార్డు కోసం ఆశపడలేదని, క్రీడా మంత్రిత్వ శాఖ ఏ నిర్ణయం తీసుకున్నా గౌరవించేదాన్నని, ఈ అశంపై వివాదాస్పదం చేయడం సరికాదన్నారు. మీడియా తీరు తనను బాధించిందన్నారు.
సైనా పేరును ప్రతిపాదిస్తాం: కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ
పద్మభూషణ్ పురస్కారం కోసం సైనా నెహ్వాల్ పేరును పరిశీలించాలని కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. పురస్కారం కోసం పంపే ప్రతిపాదనల్లో సైనా పేరును కూడా క్రీడా శాఖ చేర్చింది. తనను పద్మభూషణ్ అవార్డుకు సిఫార్సు చేయకపోవడం పైన ఇటీవల సైనా అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. దీనిపై కేంద్ర క్రీడాశాఖ మంత్రిత్వ శాఖ స్పందించింది.
ఆదివారం కూడా కేంద్ర క్రీడాశాఖ మంత్రి శరబనంద సోనోవాల్ దీనిపై స్పందించారు. బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా నుండి శనివారం నాడు తాను సైనా నెహ్వాల్ పేర దరఖాస్తు వచ్చినట్లు చెప్పారు. దానిని పరిశీలిస్తున్నట్లు చెప్పారు.
కాగా, పద్మభూషణ్ అవార్డు ఎంపిక కోసం తన దరఖాస్తును తిరస్కరించడంపై సైనా అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. నిబంధనల ప్రకారం ఈ అవార్డును పొందే అర్హత తనకు ఉందని, తనను కాదని రెజ్లర్ సుశీల్ కుమార్ పేరును ఎలా పరిగణలోకి తీసుకున్నారని సైనా ప్రశ్నించింది.
ఇదిలా ఉండగా, సైనా నెహ్వాల్ పద్మ అవార్డు గురించి ప్రశ్నించడంపై జ్వాలా గుత్తా రెండు రోజుల క్రితం ట్విట్టర్లో స్పందించారు. సాధించే సత్తా ఉన్నప్పుడు నువ్వు అవార్డు కోసం ప్రాధేయపడవద్దని వ్యాఖ్యానించారు. మరోవైపు, ఇది దరఖాస్తు చేసుకుంటే వచ్చేది కాదని మాజీ క్రీడల మంత్రి ఎంఎస్ గిల్ అన్నారు.