నకిలీ వార్తలు, తప్పుడు ప్రచారం చేస్తే ఇక జైలే, భారీ జరిమానా కూడా: కేంద్ర హోంమంత్రిత్వశాఖ
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారిపై దేశం యావత్తు ఏకమై పోరాటం చేస్తున్న ఈ విపత్కర సమయంలోనూ కొందరు తప్పుడు, నకిలీ వార్తలను ప్రచారం చేస్తుండటం ప్రమాదకరంగా మారుతున్నాయి.
లాక్డౌన్ పొడిగించిన నేపథ్యంలో హోంమంత్రిత్వశాఖ తాజాగా పలు కీలక మార్గదర్శకాలను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఏయే సేవలు కొనసాగించాలో, ఏయే సేవలు నిలిపివేయాలో స్పష్టం చేసింది. లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘించేవారిపై ఎలాంటి నేరాలు, జరిమానాలు విధించాలో అనెక్సర్ IIIలో పేజీ 11లో పొందుపర్చడం జరిగింది.
ఫేక్న్యూస్ బస్టర్
ఈ అనుబంధం ప్రభుత్వ అధికారిని అడ్డుకున్నందుకు శిక్ష, అంతేగాక, నకిలీ వార్తలు, ఫార్వర్డ్లు, వాదనలు మొదలైన వాటికి శిక్షలను కూడా నిర్దేశిస్తుంది. కాగా, తప్పుడు హెచ్చరికలను ప్రచారం చేస్తే తీవ్రమైన చర్యలు ఉంటాయని హోంమంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
కరోనా మహమ్మారి తీవ్రత, ప్రభావం గురించి తప్పుడు హెచ్చరికలు, జాగ్రత్తలు ప్రచారం చేసి ప్రజల్లో ఆందోళనలు సృష్టిస్తే భారీ జరిమానా లేదా ఏడాదిపాటు జైలు శిక్ష విధించడం జరుగుతుందని హోంమంత్రిత్వ శాఖ తేల్చి చెప్పింది.
అంతేగాక, ఏవరైనా అధికారి నుండి విపత్తు వలన కలిగే ఉపశమనం, సహాయం, మరమ్మత్తు, పునర్నిర్మాణం లేదా ఇతర ప్రయోజనాలను పొందటానికి తనకు తెలిసిన లేదా నమ్మదగిన కారణంతో ఎవరైనా తప్పుడు ప్రచారంచేసి, దోషిగా తేలితే జైలు శిక్ష విధించబడుతుంది. ఆ జైలు శిక్ష కూడా రెండు సంవత్సరాల వరకు పొడిగించడం లేదా భారీ జరిమానా విధించడం జరుగుతుంది. కాగా, కరోనా వ్యాపిస్తున్న వేళ తప్పుడు వార్తలు అటు కేంద్రం, ఇటు రాష్ట్రాలకు తీవ్ర ఇబ్బందులు సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కేంద్రం తాజాగా, కఠిన నిర్ణయాలను ప్రకటించింది.