ఆజారుద్దీన్ ఇంటికి కరెంట్, నీరు కట్ చేసిన అధికారులు
న్యూఢిల్లీ: న్యూఢిల్లీలోని అధికారిక నివాసాలను ఖాళీ చేయకుండా మొండికేస్తున్న కేంద్ర మాజీ మంత్రులు, ఎంపీల నివాసాలకు కేంద్రం విద్యుత్, నీటి సరఫరాను నిలిపివేసింది. 30 ఇళ్లకు సరఫరాలు నిలిపివేయగా అందులో అజిత్ సింగ్, జితేంద్ర సింగ్, మాజీ క్రికెటర్ మహమ్మద్ అజారుద్దీన్ నివాసాలు ఉన్నాయి.
అధికారిక నివాసాలు ఖాళీ చేయాలని చాలా సార్లు నోటీసులు పంపించినా.. తగినంత సమయమిచ్చినా స్పందించకపోవడంతో ఈ చర్యలు తీసుకున్నట్లు ఎన్డీఎంసీ అధికారి తెలిపారు. విద్యుత్, నీటి నిలిపవేత తర్వాత కొందరు ఖాళీ చేశారని ఐతే ఇంకా 15 మంది ఖాళీ చేయాల్సి ఉందని చెప్పారు. దీనికి సంబంధించి లోక సభ హౌసింగ్ కమిటీకి కూడా నివేదిక సమర్పించామని అన్నారు.
ఇలా గత ఎన్నికల్లో ఓటమిపాలైన పార్లమెంట్ సభ్యులు తమకు కేటాయించిన క్వార్టర్లను ఖాళీ చేయకపోవడంతో కొత్తగా ఎన్నికైన పార్లమెంట్ సభ్యులకు ఇళ్లు కేటాయించడం కష్టంగా మారింది.
దీంతో సెప్టెంబర్ 4వ తేదీ లోపు ఇళ్లు ఖాళీ చేయాలని లోక సభ హౌసింగ్ కమిటీ గతంలోనే నోటీసులిచ్చింది. ఆ నోటీసులకు సమాధానం చెప్పనివారి ఇళ్లకు ప్రస్తుతం విద్యుత్, నీటి సరఫరాలు నిలివివేశారు.