చీరలు కడితే రండి: లేదంటే ఆలయంలోకి రావద్దు
తిరువనంతపురం: కేరళలో ప్రసిద్ధి చెందిన శ్రీ పద్మనాభస్వామి ఆలయంలో మహిళలు ప్రవేశంపై నెలకొన్న వివాదం ముదిరిపాకనపడుతోంది. కేరళ హైకోర్టు ఆదేశాల మేరకు బుధవారం కొందరు మహిళా భక్తులు చుడీదార్లు వేసుకుని ఆలయంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించారు.
అదే సమయంలో ఆలయం అర్చకులు, అధికారులు చుడీదార్లు వేసుకుని లోపలికి వెళ్లడానికి ప్రయత్నించిన మహిళా భక్తులను అడ్డుకున్నారు. ఈ సందర్బంలో ఇరువార్లాల మధ్య వాదులాట చోటు చేసుకోవడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
తిరువనంతపురంలోని శ్రీ పద్మనాభస్వామి ఆలయంలోకి వచ్చే మహిళా భక్తులు చీరలు మాత్రమే ధరించాలననే కట్టుబాట్లు కొన్ని ఏళ్లుగా కొనసాగుతున్నది. అయితే ఈ నియమాలను సవాలు చేస్తూ సామాజిక కార్యకర్త (ఆర్ టీఐ కార్యకర్త) రియా రాజి హైకోర్టును ఆశ్రయించారు.
మంగళవారం కేరళ హై కోర్టులో అర్జీ విచారణ జరిగింది. మహిళా భక్తులు చీరలతో పాటు చుడీదార్లు వేసుకుని ఆలయంలోకి వెళ్లవచ్చని హై కోర్టు తీర్పు చెప్పింది. మహిళా భక్తులు చుడీదార్లు వేసుకోవడానికి హై కోర్టు అనుమతి ఇచ్చింది.
హై కోర్టు ఆదేశాల మేరకు బుధవారం చుడీదార్లు వేసుకుని మహిళా భక్తులు ఆలయంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించడంతో అక్కడి అర్చకులు, ఆలయం అధికారులు వారిని అడ్డుకోవడంతో వివాదం ముదిరిపోయింది.
ఈ విషయంపై ఆలయం ఎగ్జిక్యూటీవ్ ఆఫీసర్ కేఎన్. సతీష్ మాట్లాడుతూ మాకు న్యాయస్థానం రాసిన లేఖలో విచక్షణకు అనుసరించి నిర్ణయం తీసుకోవాలని ఉందని అన్నారు. దీనికి సంబంధించిన ఆదేశాలు సైతం అస్పష్టంగా ఉన్నాయని అన్నారు.
అందుకే చుడీదార్లు వేసుకున్న మహిళలను తాము ఆలయంలోకి అనుమతి ఇవ్వలేదని అధికారి సతీష్ చెప్పారు. ఈ విషయంపై కేరళ దేవాదాయ శాఖా మంత్రి కడకంపల్లి సురేంద్రన్ మీడియాతో మాట్లాడారు.
కాలానుగునంగా చాలా ఆలయాల్లోని నియమాల్లో మార్పులు చోటుచేసుకుంటున్నాయని, శ్రీ పద్మనాభస్వామి ఆలయం దగ్గర నెలకొన్న పరిస్థితిపై అక్కడి అధికారులతో మాట్లాడుతానని అన్నారు.
అయితే కొందరు మహిళా భక్తులు కావాలనే రాద్దాంతం చేసి చుడీదార్లు వేసుకుని కట్టుబాట్లు మంటకలుపుతున్నారని ఆరోపిస్తూ అనేక మంది భక్తులు రోడ్ల మీద బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. చుడీదార్లు వేసుకుని వచ్చే మహిళలను ఆలయంలోకి పంపించరాదని డిమాండ్ చేశారు. న్యాయస్థానం ఇచ్చిన తీర్పుపై భక్తలు విచారం వ్యక్తం చేస్తున్నారు.