బ్యాడ్ ఐడియా: ఢిల్లీ మెట్రోలో వారికి ఉచిత ప్రయాణం కల్పించడం సరికాదన్న శ్రీధరన్
ఢిల్లీ: ఢిల్లీ మెట్రోలో మహిళలకు ఉచితంగా ప్రయాణం కల్పించడం అనేది మంచి ఐడియా కాదని అన్నారు ఢిల్లీ మెట్రో రైల్ కార్పోరేషన్ మాజీ చీఫ్ శ్రీధరన్. ఈ విషయాన్ని తెలుపుతూ ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వం తీసుకువస్తున్న ఈ నిర్ణయాన్ని కేంద్రం అంగీకరించకూడదని ఆయన లేఖలో పేర్కొన్నారు. ఈ మధ్యే ఢిల్లీ మెట్రో, బస్సులలో మహిళలు ఉచితంగా ప్రయాణించొచ్చంటూ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. దీంతో మహిళలు పెద్ద ఎత్తున హర్షం వ్యక్తం చేశారు.
డాక్టర్లతో సమ్మె విరమింపజేయండి: మమతకు కోల్కతా హైకోర్టు సూచన
ఢిల్లీ మెట్రో రైలులో మహిళలకు ఉచితంగా ప్రయాణం కల్పించాలన్న ప్రతిపాదనపై ప్రధాని నరేంద్ర మోడీ జోక్యం చేసుకోవాలని ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్కు సలహాదారుడిగా ఉన్న శ్రీధరన్ చెప్పారు. డీఎంఆర్సీతో పాటు ఢిల్లీ ప్రభుత్వం కూడా ప్రాజెక్టులో భాగస్వామిగా ఉందని శ్రీధరన్ గుర్తుచేశారు. అలాంటి సమయంలో మరొక షేర్ హోల్డర్ అభిప్రాయం తెలుసుకోకుండా ఒక్క షేర్హోల్డరే ఎలా నిర్ణయాలు తీసుకుంటారని ఆయన లేఖలో ప్రస్తావించారు. అదికూడా ఒక వర్గం వారికే ఉచిత ప్రయాణం అని ప్రకటించడంతో ఢిల్లీ మెట్రో నష్టాల బాట పట్టే అవకాశం ఉందని శ్రీధరన్ అభిప్రాయపడ్డారు.
ఢిల్లీ మెట్రో తొలిసారిగా ప్రజలకు అందుబాటులోకి వచ్చిన సమయంలో ఎవరికీ ఎలాంటి కన్సెషన్లు ఇవ్వకూడదని నాడు చాలా గట్టిగా నిర్ణయించామని ప్రధాని మోడీ దృష్టికి తీసుకొచ్చారు శ్రీధరన్. దీని ద్వారా రెవిన్యూ తీసుకురావడంతో పాటు సామాన్య ప్రజలకు టికెట్ ధరలు అందుబాటులో ఉండేలా చేయాలనుకున్నామని శ్రీధరన్ వెల్లడించారు. అదే సమయంలో మెట్రో కూడా విరివిగా సేవలందించి వచ్చిన రెవిన్యూతో జైకా నుంచి ప్రాజెక్టు కోసం తీసుకున్న రుణాలను చెల్లించాలని భావించినట్లు శ్రీధరన్ తెలిపారు. ఇక ఢిల్లీ మెట్రోలో మహిళలకు ఉచితంగా ప్రయాణం కల్పిస్తే దేశంలోని ఇతర మెట్రోలు ఉన్న నగరాల్లో కూడా మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించాలనే డిమాండ్ ఉత్పన్నమయ్యే అవకాశం ఉందని శ్రీధరన్ ప్రధాని దృష్టికి తీసుకొచ్చారు.
మరోవైపు ఢిల్లీ మెట్రోకు వచ్చే నష్టాలను ప్రభుత్వం పూడుస్తుంది అని చెప్పడం సరికాదని అన్నారు శ్రీధరన్. ఏడాదికి రూ.1000 కోట్లు ఉంటుందని చెప్పారు. మెట్రో నెట్వర్క్ విస్తరించేకొద్దీ ఈ రెవిన్యూ పెరుగుతూ పోతుందని అలాంటప్పుడు ఎక్కడి నుంచి తీసుకొచ్చి నష్టాలను ఢిల్లీ ప్రభుత్వం పూడుస్తుందని శ్రీధరన్ చెప్పారు.