జైపూర్ అమ్మాయి మెడలో తాళి కట్టిన శ్రీశాంత్
తిరువనంతపురం: వివాదాస్పద క్రికెటర్ ఎస్ శ్రీశాంత్ జైపూర్ రాచకుటుంబానికి చెందిన అమ్మాయి మెడలో తాళి కట్టాడు. వృత్తిరీత్యా జ్యువెల్లరీ డీజైనర్ అయిన అమ్మాయిని శ్రీశాంత్ గురువయూరులోని శ్రీకృష్ణ దేవాలయంలో గురువారం పెళ్లి చేసుకున్నాడు.
వివాహానికి ముందు వేడుకలు బుధవారంనాడు కొచ్చిలోని ఓ ప్రైవేట్ హోటల్లో జరిగాయి. ఈ వేడుకలకు శ్రీశాంత్, పెళ్లి కూతురు భువనేశ్వరి సన్నిహిత కుటుంబ సభ్యులు హాజరయ్యారు. భువనేశ్వరి కుమారి తన కుటుంబ సభ్యులతో కలిసి ఈ నెల 8వ తేదీన రాజస్థాన్ నుంచి కొచ్చికి చేరుకుంది.
శ్రీశాంత్, భువనేశ్వరి కుమారి గత కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. స్పాట్ ఫిక్సింగ్ కేసులో ఇరుక్కుని జైలుకు వెళ్లినప్పుడు కూడా శ్రీశాంత్కు భువనేశ్వరి కుమారి మద్దతుగా నిలిచింది. వివాహం తర్వాత దంపతులు ఎర్నాకులం జిల్లాలోని కొత్తమంగళంలో గల తమ పూర్వీకుల ఇంటికి వెళ్తారు. వివాహానంతర వేడుకలు కొచ్చిలో జరుగుతాయని అంటున్నారు.
స్పాట్ ఫిక్సింగ్ కేసులో శ్రీశాంత్ మే 16వ తేదీన అరెస్టయ్యాడు. ఆ తర్వాత జూన్ 11వ తేదీ వరకు జైలులో ఉన్నాడు. శ్రీశాంత్పై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బిసిసి) క్రికెట్ నుంచి జీవితకాలం నిషేధం విధించింది.