శ్రీలంక రక్షణ శాఖ కార్యదర్శి రాజీనామా.. పేలుళ్ల కేసులో అనుమానితుల ఫోటోలు విడుదల..
కొలంబో : ఈస్టర్ రోజున దారుణ మారణహోమాన్ని చూసిన శ్రీలంకకు ఇంకా ఉగ్ర ముప్పు తొలిగిపోలేదు. దేశంలో ఇంకా స్లీపర్ సెల్స్ ఉండి ఉంటాయని భద్రతా దళాలు అనుమానిస్తున్నాయి. ఈ మేరకు ఓ ప్రకటన చేసిన శ్రీలంక ప్రధాని రనిల్ విక్రమ సింఘే శ్రీలంకలో మరిన్ని బాంబు పేలుళ్లు జరగవచ్చన్న అనుమానం వ్యక్తం చేశారు. పేలుళ్ల నిందితులతో పాటు స్లీపర్ సెల్స్ ఉగ్రవాదుల్ని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు.
శ్రీలంకలో మూతపడ్డ క్యాథలిక్ చర్చిలు: సామూహిక ప్రార్థనల రద్దు
రక్షణశాఖ కార్యదర్శి రాజీనామా
బాంబు పేలుళ్ల ఘటనకు నైతిక బాధ్యతవహిస్తూ రక్షణశాఖ కార్యదర్శి హేమసిరి ఫెర్నాండో రాజీనామా చేశారు. నిఘా విషయంలో ఘోర వైఫల్యం చెందారన్న విమర్శల నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. దాడులకు సంబంధించి సమాచారాన్ని తమకు తెలియజేయలేదని ప్రెసిడెంట్ మైత్రిపాల సిరిసేన, ప్రధాని రనిల్ విక్రమసింఘే రక్షణ శాఖ కార్యదర్శిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫెర్నాడో రాజీనామా నేపథ్యంలో 24గంటల్లో కొత్త సెక్రటరీని నియమించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
నిందితుల ఫొటోలు విడుదుల
శ్రీలంక నరమేధంలో 359మంది మృతి చెందినట్లు శ్రీలంక ప్రకటించింది. అయితే ఆ లెక్క తప్పని, దాడుల్లో 253 మంది మాత్రమే చనిపోయారని గురువారం ప్రకటించింది. మరోవైపు పేలుళ్లతో సంబంధముందని భావిస్తున్న ఆరుగురు అనుమానితుల పేర్లు, ఫోటోలను ప్రభుత్వం విడుదల చేసింది.
39దేశాలకు వీసాల రద్దు
ఉగ్ర దాడుల నేపథ్యంలో శ్రీలంక వీసా ఆన్ అరైవల్ విధానాన్ని తాత్కాలికంగా రద్దు చేసింది. ఈ పద్ధతిలో 39 దేశాల ప్రజలు శ్రీలంక చేరుకున్నాక అక్కడ వీసా పొందే అవకాశం ఉండేది. పర్యాటకులను ఆకర్షించేందుకు ప్రభుత్వం ఈ విధానాన్ని అమలు చేసింది. అయితే పేలుళ్లకు విదేశీయులతో సంబంధముందన్న అనుమానాల నేపథ్యంలో శ్రీలంక వీసా ఆన్ అరైవల్ను రద్దు చేసింది.
16మంది నిందితుల అరెస్ట్
బాంబు పేలుళ్ల ఘటనతో సంబంధముందన్న అనుమానంతో శ్రీలంక పోలీసులు మరో 16మందిని అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఇప్పటి వరకు అరెస్టయిన వారి సంఖ్య 76కు చేరింది.