శ్రీలంక దుర్ఘటన భారత్ కు ఓ హెచ్చరిక..! అప్రమత్తంగా ఉండాలంటున్న నిఘా వర్గాలు..!!
హైదరాబాద్ : శ్రీలంకలో ఐసిస్ మారణహోమం వెనుక చాలా కారణాలున్నట్లు నిఘావర్గాలు భావిస్తున్నాయి. శ్రీలంకలో కుబేరుడి ముగ్గురు కుమారులు కీలక సూత్రదారులుగా ప్రాథమిక అంచనా వేసింది భారత్. అయితే భారత నిఘావర్గాలు వారం రోజులు ముందుగానే లంక సర్కారును బాంబుపేలుళ్లపై హెచ్చరించినా స్పందించకపోవటం ఫలితం 300 మందికి పైగా మరణించటమే అనే చర్చ జరుగుతోంది.
నెక్ట్స్ ఏసేది భారత్ నే.. ఐసిస్ కదలికలు..! పసిగట్టిన బారత్ నిఘా వర్గాలు..!!
అయితే ఐసిస్ దక్షిణాసియాపై గురి పెట్టేందుకు ప్రధానకారణం భారత్. రెండేళ్ల క్రితం నుంచి ఇండియాలో పేలుళ్ల కుట్రకు పన్నాగం పన్నినా నిఘావర్గాలు ముందుగానే పసిగడుతున్నాయి. అరెస్టులతో ముష్కరుల వ్యూహాన్ని తిప్పి కొడుతున్నాయి. కానీ ఎలాగైనా ఇండియాలో భారీ పేలుళ్లకు తెరలేపి తమ ఉనికి చాటుకునేందుకు ఐసిస్ సంస్థ తీవ్రప్రయత్నాలు చేస్తోందంటున్నారు నిఘా అధికారులు.
కీలక నగరాల్లో విద్వంసం..! అప్రమత్తం చేసిన ఇంటెలీజెన్స్ శాఖ..!!
బెంగళూరు, ఢిల్లీ, ముంబై, చెన్నై, హైదరాబాద్, విశాఖపట్టణం వంటి కీలకమైన నగరాలలో విధ్వంసం సృష్టించటం ద్వారా తమ సత్తా చాటాలనేది ఉగ్రమూకల వ్యూహంగా తెలుస్తోంది. మూడేళ్ల క్రితం ఫ్రాన్స్ లో పేలుడు పదార్ధాలతో కూడిన ట్రక్తో జన సమ్మర్ధం ఉన్నచోట రోడ్డు ప్రమాదం రూపంలో ఆత్మాహుతి దాడి జరిపారు. అదే తరహాలో భారత్లోని కీలక నగరాల్లో ఏక సమయంలో ఇటువంటి దాడులకు పాల్పడాలనేది వారి పక్కా ప్లాన్గా నిఘావర్గాలు పసిగట్టాయి.
పటిష్టంగా భారత నిఘా వర్గం..! సాగని ఐసిస్ ఆగడాలు..!!
ఈ మేరకు అన్ని నగరాలను అప్రమత్తం చేశాయి. మూడేళ్ల క్రితం హైదరాబాద్లో ఐసిస్ సానుభూతిపరులు 13 మంది పట్టు బడ్డారు. ఇటీవల మరో ముగ్గురుని పాతబస్తీలో ఎన్ ఐఏ అరెస్టు చేసింది. వీరి లక్ష్యం హైదరాబాద్లో మరణ మృదంగం మోగించటమే అనేది విచారణలో గుర్తించారు. అరెస్టయి జైల్లో ఉన్నా వీరిలో కించిత్తు బాధగానీ విచారం గాని లేదని పోలీసులు చెప్పుకొస్తున్నారు.
అప్రమత్తంగా ఉండాలి..! హెచ్చరిస్తున్న గూఢచారి వ్యవస్థ..!!
అంతే కాకుండా ఉత్సాహంగా ఉంటూ.. తమకు బిర్యానీ రుచులు, ఆధునిక డ్రెస్సులు కావాలంటూ జైలు అధికారులను బెదిరించటం విశేషం. తాము వీఐపీలు అనే భావనతో పెత్తనం చెలాయిస్తున్నారట. ఈ నేపథ్యంలోనే జైలు నుంచి వీరిని తప్పించేందుకు బయట ఉగ్ర కుట్ర జరిగిందనే ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం లంకలో చోటుచేసుకున్న పరిణామాలతో తరువాత ఐసిస్ టార్గెట్ భారత్ కావచ్చని నిఘా వర్గాలు భావిస్తున్నాయి. ఈ మేరకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాలకు హెచ్చరికలు జారీచేశాయి భారత్ నిఘా వర్గాలు.