రామమందిర నిర్మాణంపై మోడీ కీలక ప్రకటన: శ్రీ రామజన్మభూమి తీర్థ క్షేత్ర పేరుతో..!
న్యూఢిల్లీ: చారిత్రాత్మక అయోధ్యలో రామమందిర నిర్మాణంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కీలక ప్రకటన చేశారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచార పర్వానికి గురువారం తెరపడబోతున్న ప్రస్తుత పరిస్థితుల్లో రామమందిరం నిర్మాణంపై ఆయన లోక్సభలో ఓ ప్రకటన చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అయోధ్యలో రామజన్మభూమి-బాబ్రీ మసీదు భూవివాదానికి సంబంధించి.. దేశ అత్యున్నత న్యాయస్థానం తన తుది తీర్పును వెల్లడించిన తరువాత.. నరేంద్ర మోడీ ఈ అంశంపై స్పందించారు.
శ్రీ రామజన్మభూమి తీర్థ క్షేత్ర పేరుతో..
అయోధ్యలో రామమందిరాన్ని నిర్మించడానికి ప్రత్యేకంగా ఓ ట్రస్టును ఏర్పాటు చేయబోతున్నట్లు మోడీ వెల్లడించారు. ఈ ట్రస్టుకు శ్రీ రామజన్మభూమి తీర్థ క్షేత్ర అని నామకరణం చేసినట్లు తెలిపారు. రామమందిరం నిర్మాణ బాధ్యతలను ఈ ట్రస్ట్ తీసుకుంటుందని అన్నారు. స్వతంత్రంగా వ్యవహరించేలా దీని విధి, విధానాలను రూపొందించినట్లు చెప్పారు. ట్రస్టును ఏర్పాటు చేయాలనే నిర్ణయాన్ని ఈ ఉదయం ఏర్పాటు చేసిన మంత్రివర్గ సమావేశంలో తీసుకున్నామని, ఈ వివరాలను సగర్వంగా పార్లమెంట్కు వివరిస్తున్నానని చెప్పారు.
130 కోట్ల మంది భారతీయులకు సెల్యూట్..
అత్యంత సున్నితం, సమస్యాత్మకమైన అంశంగా గుర్తింపు పొందిన రామజన్మభూమి-బాబ్రీ మసీదు భూ వివాదాన్ని సుప్రీంకోర్టు పరిష్కరించడాన్ని దేశంలో ఉన్న 130 కోట్ల మంది ప్రజలు స్వాగతించారని, వారికి తాను సెల్యూట్ చేస్తున్నట్లు మోడీ చెప్పారు. దేశ సమగ్రతను, ఐకమత్యాన్ని, మత సామరస్యాన్ని చాటారని అన్నారు. సుప్రీంకోర్టు తన తీర్పును వెల్లడించిన తరువాత దేశ ప్రజలు రామమందిరం నిర్మాణం కోసం ఎదురు చూస్తున్నారని, వారిని అకాంక్షలు త్వరలోనే తీరబోతున్నాయని చెప్పారు.
సబ్ కా సాథ్.. సబ్ కా వికాస్ నినాదం..
రామజన్మభూమిపై తీర్పు వెలువడిన తరువాత ముస్లింలు దాన్ని స్వాగతించారని నరేంద్ర మోడీ గుర్తు చేశారు. హిందువులు, ముస్లింలు, సిక్కులు, క్రైస్తవులు, బౌద్ధులు, పార్శీలు, జైనులు.. ఇలా అన్ని వర్గాల ప్రజలు ఒకే కుటుంబంగా మనదేశంలో కలిసి ఉన్నారని, వారందర్నీ అభివృద్ధి పథంలో పయనింపజేస్తామని అన్నారు. సబ్ కా సాథ్.. సబ్ కా వికాస్ నినాదంతో తాము దేశంలో అభివృద్ధి పనులను కొనసాగిస్తామని చెప్పారు.
తీర్పు తరువాత తొలిసారిగా..
రామజన్మభూమి-బాబ్రీ మసీదుపై గత ఏడాది నవంబర్ 9వ తేదీన సుప్రీంకోర్టు తన తుది తీర్పును వెల్లడించిన విషయం తెలిసిందే. ఉత్తర ప్రదేశ్లోని అయోధ్యలో 2.77 ఎకరాల స్థలాన్ని రామ్లల్లా విరాజ్మాన్కు చెందుతుందంటూ అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగొయ్ తీర్పు వెల్లడించారు. ప్రత్యామ్నాయంగా ముస్లిం పార్టీలకు అయిదు ఎకరాల స్థలాన్ని కేటాయించాల్సి ఉంటుందని ఆదేశించారు. ఈ తీర్పు తరువాత నరేంద్ర మోడీ.. లోక్సభలో స్పందించడం ఇదే తొలిసారి.