ప్రేమికులపై దాడి, అసలు మీరెవరు, సుప్రీం కోర్టు
న్యూఢిల్లీ: జంటగా కనపడితే ప్రేమికుల మీద దాడులు చేసే హక్కు మీకెవరిచ్చారు అని శ్రీరామసేన అధ్యక్షుడు ప్రమోద్ ముతాలిక్ ను సుప్రీం కోర్టు ప్రశ్నించింది. గత జూన్ 2వ తేదిన గోవాలోకి ప్రవేశించరాదని ముంబై కోర్టు శ్రీరామసేన అధ్యక్షుడు ప్రమోద్ ముతాలిక్ కు ఆదేశాలు జారీ చేసింది.
ముంబై హై కోర్టు ఆదేశాలను సవాలు చేస్తు ప్రమోద్ ముతాలిక్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. సుప్రీం కోర్టు ముతాలిక్ సమర్పించిన అర్జీని విచారణ చేసింది. పర్యాటక ప్రాంతాలు, పార్కులు తదితర ప్రాంతాలలో ప్రేమ జంటల మీద ఎందుకు దాడులు చేస్తున్నారని సుప్రీం కోర్టు ప్రశ్నించింది.
సాంసృతిక పరిరక్షకులుగా మీకు మీరే ప్రకటించుకోవడం ఏమిటి అని ప్రశ్నించింది. శ్రీరామసేన చీఫ్ ముతాలిక్ సమర్పించిన పిటిషన్ ను సుప్రీం కోర్టు విచారణకు తిరస్కరించింది. ముంబై హైకోర్టు తీర్పును సవాలు చేస్తు గతంలో ముతాలిక్ గోవా కోర్టును ఆశ్రయించారు.
అయితే గోవా కోర్టులో ముతాలిక్ కు నిరాశే ఎదురుకావడంతో ఆయన సుప్రీం కోర్టును ఆశ్రయించారు. కర్ణాటకలోని అనేక ప్రాంతాలలో ప్రేమ జంటల మీద శ్రీరామ సేన కార్యకర్తలు దాడులు చేశారని పలు కేసులు నమోదు అయ్యాయి.