ఉత్కంఠ: రవిశంకర్ వ్యాఖ్యలపై గ్రీన్ ట్రిబ్యునల్ ఆగ్రహం
న్యూఢిల్లీ: ఢిల్లీలోని యమునా తీరంలో ఆర్ట్ ఆప్ లివింగ్ తలపెట్టిన ప్రపంచ సాంస్కృతిక సమ్మేళన సభపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు జరగనున్న ఈ కార్యక్రమంపై పర్యావరణ పరిహారంగా రూ.5 కోట్లు చెల్లించాలని గ్రీన్ ట్రిబ్యునల్ జరిమానా విధించిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఫైన్ కట్టలేనని జైలుకైనా వెళ్లేందుకు సిద్ధమని పండిట్ రవిశంకర్ చేసిన వ్యాఖ్యలపై గ్రీన్ ట్రిబ్యునల్ మండిపడుతోంది. ట్రిబ్యునల్ను వివాదాస్పదం చెయొద్దంటూ గ్రీన్ ట్రిట్యునల్ ఆదేశించింది. దీంతో సాయంత్రం 5 గంటలలోపు రూ. 5 కోట్లు కట్టలేమని సంస్ధ వెల్లడించింది.
అంత పెద్ద మొత్తాన్ని ఇప్పటికిపుడు చెల్లించలేమని తెలిపింది. తమది స్వచ్ఛంధ సంస్థ అని, కల్చరల్ ఫెస్టివల్ ఆరంభమయ్యేలోపు అంత మొత్తాన్ని సమీకరించలేమని పిటిషన్లో పేర్కొంది. అయితే తక్షణమే రూ.25 లక్షలు చెల్లించాలని, మిగిలిన రూ 4.75 కోట్లు చెల్లించడానికి వీలుగా 3 వారాల గడువును ఇస్తూ కోర్టు తీర్పు చెప్పింది.
ఒకవేళ ఈరోజు రూ .25 లక్షల చెల్లించడంలో సంస్థ విఫలమైతే ప్రభుత్వం జారీ చేసే 2.5 కోట్ల రూపాయలు ఎటాచ్ చేయబడతాయని తెలిపింది. దీనిపై తదుపరి విచారణను ఏ్రపిల్ 4వ తేదీకి వాయిదా వేసింది.
Also Read: జైలుకైనా వెళ్తా, జరిమానా కట్టను: శ్రీశ్రీ రవి శంకర్
పైన్ కట్టేందుకు నాలుగు వారాల సమయం కావాలంటూ గ్రీన్ ట్రిబ్యునల్లో ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్ధ పిటిషన్ దాఖలు చేసింది. మరోవైపు ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్ధ నిర్వహించ తలపెట్టిన ఈ కార్యక్రమంపై స్టే ఇవ్వాలంటూ మరోసారి పర్యావరణ వేత్తలు హైకోర్టుకు వెళ్లారు.
ఆర్ట్ ఆఫ్ లివింగ్ 35వ వార్షిక వేడుకలను యమునా తీరంలో ప్రపంచ సాంస్కృతిక సమ్మేళన సభ పేరుతో ఆర్ట్ ఆప్ లివింగ్ నిర్వహిస్తుంది. ఈ ఉత్సవాలు శుక్రవారం సాయంత్రం నుంచి ప్రారంభం కానున్నాయి. మూడు రోజుల పాటు జరిగే ఈ వేడుకల్లో ప్రపంచ దేశాలకు చెందిన 36వేల మందికి పైగా కళాకారులు ప్రదర్శన ఇవ్వనున్నారు.
ఈ కార్యక్రమం కోసం ఢిల్లీ - నోయిడాల మధ్య వేయి ఎకరాలకు పైగా సున్నితమైన ప్రాంతం మొత్తాన్ని ఒక్క గడ్డి పరక లేకుండా చదును చేశారని, వేడుక నిలిపివేయాలని కోరుతూ పర్యావరణ కార్యకర్త ఆనంద్ గ్రీన్ ట్రైబ్యునల్ను ఆశ్రయించారు. దీంతో వివాదం మొదలైంది.
ఆ తర్వాత పర్యావరణ వేత్తలు, ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ వాదనలతో పాటు.. పలు ప్రభుత్వ శాఖల వాదనలు విన్న నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్... కార్యక్రమానికి అనుమతినిచ్చింది. అయితే, పర్యావరణాన్ని ధ్వంసం చేసినందుకు ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్కు 5 కోట్ల రూపాయల జరిమానా విధించింది.
అంతేకాదు విధులు సక్రమంగా నిర్వహించనందుకు ఢిల్లీ డెవలప్ మెంట్ అథారిటీకి ఐదు లక్షలు, ఢిల్లీ పొల్యూషన్ కంట్రోల్ బోర్టుకు లక్ష రూపాయలు ఫైన్ వేసింది. ఈ పరిహారంపై శ్రీశ్రీ రవిశంకర్ మాట్లాడుతూ... జైలుకైనా వెళ్తా కానీ జరిమానా మాత్రం కట్టనని స్పష్టం చేశారు.
తామేమీ తప్పు చేయలేదని, జైలుకు వెళ్లేందుకైనా సిద్ధంగా ఉన్నాము కానీ జరిమానా చెల్లించేందుకు సిద్ధంగా లేమన్నారు. దీంతో రవిశంకర్ వ్యాఖ్యలపై ట్రిబ్యునల్ మండిపడుతోంది. ఈ కార్యక్రమానికి 35 లక్షల మంది హాజరవుతారని అంచనా వేస్తున్నారు. మూడు వేల మందికి పైగా కూర్చునేందుకు వీలుగా భారీ వేదికను తయారు చేస్తున్నారు.
ఇంత భారీ కార్యక్రమాన్ని యమునా నది తీరంలో నిర్వహిస్తే నది కలుషితమవుతుందని పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమ నిర్వహణ కోసం 25 కోట్లకు పైగా ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ ఖర్చు చేస్తోంది. స్టేజి నిర్మాణం కోసం 15.63 కోట్లు, దాని డెకరేషన్ కోసం మరో 10 కోట్లు ఖర్చు చేస్తుంది.
ఈ వ్వవహారంపై కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు ట్విట్టర్ ద్వారా స్పందించారు. ఈ వేడుకలు దేశానికి కీర్తి తెస్తాయని, రాజకీయం చేయెద్దని కోరారు. దాదాపు 36వేల మంది కళాకారులు ఈ కార్యక్రమంలో ప్రదర్శన ఇస్తున్నారని.. ఇదో ప్రపంచ రికార్డు లాంటిదన్నారు.
ఈ ఉత్సవాల్లో అందరూ పాల్గొని, విజయవంతం చేయాలని కోరారు. నిజానికి ప్రపంచ సాంస్కృతిక సమ్మేళన కార్యక్రమాన్ని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రారంభించాల్సి ఉంది. ఈ కార్యక్రమం పర్యావరణానికి హాని చేస్తుందని ఆందోళనలు రావడంతో రాష్ట్రపతి ప్రణబ్ ఈ కార్యక్రమానికి రావడం లేదని ప్రకటించారు.