తెలుపు రంగు వాహనంలోనే, నేడు శ్రీదేవి అంత్యక్రియలు
Recommended Video
ముంబై:ఇండియన్ స్టార్ శ్రీదేవి భౌతికకాయం స్వగృహానికి చేరుకోవడంతో వేలాది మంది అభిమానులు, వందలాది మంది నటీనటులు ముంబైకి చేరుకుంటున్నారు. శ్రీదేవిని కడసారి చూసేందుకు ముంబైకి వస్తున్నారు. శ్రీదేవి స్వగృహంలో పార్ధీవదేహన్ని ఉంచారు. శ్రీదేవి ఇంటి ప్రాంగణమంతా జనాలతో కిక్కిరిసింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు.
శ్రీదేవికి తెలుపు రంగు అంటే ఇష్టం. దీంతో శ్రీదేవి నివాసం ఉన్న ఇంటి నుండి ఆమె పార్థీవ దేహన్ని స్పోర్ట్స్ క్లబ్కు తీసుకెళ్ళేందుకు ఏర్పాటు చేసిన వాహనాన్ని తెలుపు రంగుతో అలంకరించారు.
ఈ బాధాకర సమయంలో మాకు తోడుగా నిలిచిన మీడియాకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అని పేర్కొంటూ కపూర్, అయ్యప్పన్ కుటుంబాలు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశాయి. శ్రీదేవి భౌతికకాయాన్ని అభిమానులు, శ్రేయోభిలాషుల చివరి చూపుకోసం లోఖండ్వాలాలోని సెలబ్రేషన్ స్పోర్ట్స్ క్లబ్లో బుధవారం ఉదయం 9.30 నుంచి మధ్యా హ్నం 12.30 వరకు ఉంచుతామన్నారు. 2 గంటల నుంచి అంతిమ యాత్ర ప్రారంభమవుతుందని తెలిపారు. మీడియా కూడా నివాళులర్పించవచ్చని, అయితే కెమెరాలు, ఇతర రికార్డింగ్ వస్తువులను బయటే వదిలేసి రావాలని విజ్ఞప్తి చేశారు.
ముంబైలోని బోనీకపూర్ సోదరుడు అనిల్ కపూర్ నివాసం శ్రీదేవి సహ నటులు, శ్రేయోభిలాషులతో కిక్కిరిసిపోయింది. ఆదివారం నుంచే వారంతా రావడం ప్రారంభించారు. ''మా నాన్న మరణం తర్వాత నన్నంతగా బాధించింది శ్రీదేవి మరణమే. ఈ వార్త విన్నప్పటి నుంచి ఆమె ముఖమే పదేపదే నాకు గుర్తొస్తోంది. తను నన్నెంతో ప్రేమగా చూసేది. నాకు స్ఫూర్తిదాయకంగా నిలిచిన వ్యక్తిత్వం ఆమెది. నేను తనను చిన్నమ్మ (మౌసీ)లా భావిస్తాను''అని బాలీవుడ్ నటి రాణి ముఖర్జీ కన్నీళ్ల పర్యంతమయ్యారు.
బుదవారం మధ్యాహ్నం 2గంటలకు శ్రీదేవి అంతిమయాత్ర జరగనుంది. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు సందర్శనార్థం సెలబ్రేషన్ క్లబ్లో శ్రీదేవి పార్థివదేహం ఉంచనున్నారు.మధ్యాహ్నం 3.30 గంటలకు విలేపార్లే హిందూ స్మశాన వాటికలో అంత్యక్రియలు జరగనున్నాయి.
శ్రీదేవి అంత్యక్రియలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్టు కుటుంబసభ్యులు ప్రకటించారు. కడసారి చూసేందుకు అభిమానులకు ఏర్పాట్లు చేశారు. అయితే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకొన్నారు.
అతిలోక సుందరి అంతిమ యాత్రలో పాల్గొనేందుకు ఇప్పటికే పలువురు ప్రముఖులు, నటీనటులు ముంబైకి చేరుకున్నారు. హైదరాబాద్ నుంచి తెలుగు సినీ ప్రముఖులు కూడా ముంబైకి బయలుదేరారు.