ఆఖరి పయనంలోనూ శ్రీదేవి రికార్డు?: అప్పట్లో రఫీ.. ఆ తర్వాత!
Recommended Video
ముంబై: అర్థ శతాబ్దం పాటు తమను అలరించిన అందాల నటి శ్రీదేవి ఆఖరి పయనం ముంబైని జనసంద్రంగా మార్చింది. అశ్రు నయనాల మధ్య లక్షల్లో తరలివచ్చిన ఆమె అభిమానులు కడసారి చూపుకోసం కి.మీ కొద్ది బారులు తీరారు.
వెండి తెరపై శ్రీదేవికి నీరాజనాలు పలికిన జనం.. అంతిమయాత్రలోనూ లక్షలాదిగా తరలివచ్చారు. ఇసుకేస్తే రాలనంత జనంతో శ్రీదేవి అంతిమయాత్ర ఒకవిధంగా రికార్డు అనే అంటున్నారు. రాజకీయేతర వ్యక్తుల్లో ఇంతలా నీరాజనాలు అందుకున్న అతి కొద్ది మంది వ్యక్తుల్లో ఒకరిగా శ్రీదేవి నిలిచిపోయారు.
శ్రీదేవి జీవితం మహోన్నతం, ఆమె కలల సాకారం కోసం.: కపూర్ ఫ్యామిలీ ఉద్వేగపూరిత లేఖ
ఆల్ టైమ్ రికార్డు.. రఫీదే:
ముంబైలో రాజకీయేతర ప్రముఖుల అంతిమయాత్రల్లో అలనాటి గాయకుడు మహమ్మద్ రఫీదే ఆల్ టైమ్ రికార్డు అని చెబుతుంటారు. తన గాత్రంతో దేశంలోని అన్ని వర్గాలకు దగ్గరైన రఫీ కోసం.. ఆయన అంతిమయాత్ర(జులై, 1980)కు దాదాపు 10లక్షల పైచిలుకు జనం తరలివచ్చినట్టు చెబుతారు.
రాజేశ్ ఖన్నా, రాజ్ కపూర్:
మహమ్మద్ రఫీ తర్వాత భారతీయ మొట్టమొదటి వెండితెర సూపర్ స్టార్ రాజేశ్ ఖన్నా(జులై,2012) అంతిమయాత్రకు మళ్లీ ఆ స్థాయిలో జనం తరలివచ్చారు. రాజ్కపూర్(జూన్, 1988), వినోద్ ఖన్నా(ఏప్రిల్ 2017)ల అంతిమయాత్రల్లోనూ లక్షలాది జనం కనిపించారు.
మళ్లీ ఇప్పుడు శ్రీదేవి..:
రఫీ, రాజేశ్ ఖన్నా,రాజ్ కపూర్, వినోద్ ఖన్నాల తర్వాత.. శ్రీదేవి అంతిమయాత్రలోనే జనం ఆ స్థాయిలో తరలివచ్చారు. బహు భాషల్లో నటించిన నటిగానూ, తన అందంతోనూ దక్షిణాది, ఉత్తరాది ప్రేక్షకులకు దగ్గరవడంతో ఆమెను భారతీయ మొట్టమొదటి మహిళా సూపర్ స్టార్ అని మీడియా కొనియాడుతున్న సంగతి తెలిసిందే.
తరలివచ్చిన తారలు..:
శ్రీదేవి మరణంపై అనుమానాల సంగతెలా ఉన్నా.. ఆఖరి యాత్ర మాత్రం అందరినీ ఆశ్చర్యపరిచిందనే చెప్పాలి. అన్ని రంగాల ప్రముఖులతో పాటు ప్రధానంగా సినీ ఇండస్ట్రీ నుంచి పెద్ద ఎత్తున తారలు తరలివచ్చారు. అమితాబ్ బచ్చన్, రేఖ, ఐశ్వర్య రాయ్, అర్బాజ్ ఖాన్, మాధూరి దీక్షిత్, అక్షయ్ ఖన్నా, టబు, ఫరా ఖాన్, నితిన్ ముఖేష్, విద్యా బాలన్, సుశ్మితాః సేన్, హేమ మాలిని తదితరలు తరలివచ్చారు.