ఎన్కౌంటర్: మిలిటెంట్ హతం, ఇద్దరు పౌరులను చంపిన ఉగ్రవాదులు
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్లోని శ్రీనగర్లో శనివారం ఉదయం నుంచి భద్రతా సిబ్బందికి, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. సఫకాదల్లోని తబేలా ఛట్టాబల్ ప్రాంతంలో ఉగ్రవాదులు దాగి ఉన్నారన్న సమాచారంతో గాలింపు చర్యలు ప్రారంభించామని పోలీసులు వెల్లడించారు.
దాగి ఉన్న మిలిటెంట్లు కాల్పులు జరపడంతో భద్రతాదళాలు వారిని ఎదుర్కొనేందుకు ఎదురుకాల్పులు జరపాల్సి వచ్చిందని అధికారులు తెలిపారు. ఓ ఇంట్లో ఇద్దరు ఉగ్రవాదులు దాగి కాల్పులు జరుపుతున్నారని, ఎన్కౌంటర్ కొనసాగుతోందని వెల్లడించారు. ఈ కాల్పుల ఘటనలో ఓ మిలిటెంట్ హతమయ్యాడు. మిగితా వారి కోసం వేట కొనసాగుతోంది. ఉగ్రవాదుల కాల్పుల్లో ఓ సీఎర్పీఎఫ్ జవాను తీవ్రంగా గాయపడ్డాడు.
ఇది ఇలా ఉండగా, బందీపొరా జిల్లాలో లష్కర్-ఈ- తైబా అనే ఉగ్రవాద సంస్థకు చెందిన ముష్కరులు ఇద్దరు పౌరులను అపహరించి అనంతరం హత్య చేశారని పోలీసులు వెల్లడించారు. శుక్రవారం రాత్రి బందీపొరా జిల్లాలోని గుల్షాన్ మొహల్లా ప్రాంతంలో గులామ్ హసన్ దార్(45), బషీర్ అహ్మద్ దార్(26) అనే ఇద్దరు వ్యక్తుల ఇళ్లలోకి ఉగ్రవాదులు చొరబడి వారిని అపహరించుకుపోయారని పోలీసులు తెలిపారు.
శనివారం తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో వారిద్దరినీ కాల్చి చంపారని చెప్పారు. మసీద సమీపంలో పడి ఉన్న వారి మృతదేహాలను స్థానికులు గురించినట్లు తెలిపారు. చనిపోయిన వ్యక్తులిద్దరినీ బంధువులుగా గుర్తించారు. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం లష్కర్-ఈ-తైబా ఉగ్రవాదులు ఈ ఘటనకు పాల్పడినట్లు తెలుస్తోందని పోలీసులు తెలిపారు.