ఐపీఎల్: శ్రీనివాసన్కు సుప్రీంలో క్లీన్చిట్, షాక్ కూడా, 6వారాల్లో...
న్యూఢిల్లీ: ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ కేసులో గురువారం నాడు అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు తీర్పు వెలువరించింది. ఎన్ శ్రీనివాసన్కు కోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది. శ్రీనివాసన్ పైన వచ్చిన ఆరోపణలకు ఆధారాలు లేవని, నిబంధనల మేరకే ముద్గల్ కమిటీ నివేదిక ఇచ్చిందని న్యాయస్థానం చెప్పింది.
జూన్ 2013 నాటి ఈ కేసులో దాదాపు పద్దెనిమిది నెలల అనంతరం సుప్రీం కోర్టు తీర్పు వెలువరించింది. సర్వోన్నత న్యాయస్థానం 130 పేజీల తీర్పును వెలువరించింది. అయితే, శ్రీనివాసన్ బీసీసీఐ ఎన్నికల్లో పోటీ చేయరాదని పేర్కొంది. ఏదో ఒక పదవిలో మాత్రమే కొనసాగాలని చెప్పింది. ఆరు వారాల్లో కొత్తగా బీసీసీఐకి ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది. తన సొంత టీం కోసం శ్రీనివాసన్ బీసీసీఐలో సవరణలు చేయడం సరికాదని పేర్కొంది.
బీసీసీఐ విధులు పబ్లిక్కు సంబంధించినవేనని కోర్టు పేర్కొంది. శ్రీనివాసన్ అల్లుడు గురునాథ్ మీయప్పన్, రాజ్ కుంద్రాలు ఫ్రాంచైజీల సహయజమానులు అని తెలిపింది. వీరిద్దరు కూడా బెట్టింగుకు పాల్పడ్డారని తెలిపింది. పలు అంశాల కోసం ఓ రిపోర్ట్ కమిటీని ఏర్పాటు చేయాలని సుప్రీం సూచించింది.
సీఎస్కే, రాజస్థాన్ ఫ్రాంచైజీల పైన....
జస్టిస్ లోద్రా, తదితరులతో కూడిన ఇండిపెండెంట్ ప్యానల్ చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ భవితవ్యం తేలుస్తాయని కోర్టు తెలిపింది. కాగా, ఈ కేసులో గత ఏడాది డిసెంబర్ 17వ తేదీన తుది వాదనలు విన్న ద్విసభ్య బెంచ్ తీర్పును రిజర్వ్ చేసింది. ఈ రోజు వెలువరించింది.