స్పాట్ ఫిక్సింగ్: ఏడుగురి పేర్లను వెల్లడించిన సుప్రీం కోర్టు
న్యూఢిల్లీ: భారత్ క్రికెట్ను ఒక కుదుపు కుదుపిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) స్పాట్ ఫిక్సింగ్ కేసు విచారణ తుది దశకు చేరుకుంది. ఈ కేసును విచారించిన ముద్గల్ కమిటీ నివేదికలో 13 పేర్లకు గాను ఏడు పేర్లను సుప్రీం కోర్టు వెల్లడించింది.
జస్టిస్ ముద్గల్ ఆధ్వర్యంలోని విచారణ కమిటీ సీల్డ్ కవర్లో అందించిన సమాచారాన్ని సుప్రీం కోర్టు వెల్లడించింది. ఇందులో ఐసీసీ చీఫ్ ఎన్ శ్రీనివాసన్, ఆయన అల్లుడు గురునాథ్ మేయప్పన్, క్రికెటర్లు స్టువర్ట్ బిన్నీ(ఇండియా), ఓవైషా (ఇంగ్లాండ్), శామ్యూల్ బాడ్రీ (వెస్టిండిస్), బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా, మాజీ ఐపీఎల్ ఆఫీసర్ సుందర్ రామన్లు ఉన్నారు.
స్పాట్ ఫిక్సింగ్ కేసు తదుపరి విచారణను సుప్రీం కోర్టు ఈ నెల 24కు వాయిదా వేసింది. ఐపీఎల్ స్ఫాట్ ఫిక్సింగ్, బెట్టింగ్లపై విచారణ చేసేందుకు ముద్గల్ కమిటీని నియమించిన సంగతి తెలిసిందే. ఏమైనా అభ్యంతరాలుంటే నాలుగు రోజుల్లో ఫైల్ చేయాల్సిందిగా శ్రీనివాసన్, మేయప్పన్, రాజ్ కుంద్రా, రామన్లకు సూచించింది.
త్వరలో జరగనున్న బీసీసీఐ అధ్యక్షుడి ఎన్నికలకు సంబంధించి నిర్వహించనున్న సర్వసభ్య సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు అపెక్స్ కోర్టుకి బీసీసీఐ తెలిపింది. ఐతే ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ వ్వవహారాలపై విచారణ జరిపి, సుప్రీం కోర్టుకు తుది నివేదిక సమర్పించిన జస్టిస్ ముద్గల్ కమిటీ శ్రీనివాసన్కు క్లీన్ చిట్ ఇచ్చినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి.