స్టాఫ్ సెలెక్షన్ పరీక్ష: కత్రినా, దీపికా ఎవరు పొడువు?
న్యూఢిల్లీ: స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (ఎస్ఎస్సి) పరీక్ష ప్రశ్నాపత్రంలో ఎదురైన ఓ ప్రశ్నను చూసి అందరూ ముక్కున వేలేసుకున్నారు. కేంద్ర మంత్రిత్వశాఖల్లో, ఇతర ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాల నియామకానికి ఆ పరీక్ష నిర్వహిస్తారు. బాలీవుడు తారల్లో ఎవరు పొడుగ్గా ఉంటారంటూ ఆ పరీక్షలో ఓ ప్రశ్న వేసి నాలుగు ప్రత్యామ్నాయాలు ఇచ్చారు
దానికి ఎస్ఎస్సి చైర్మన్ ఎ భట్టాచార్య విచారం వ్యక్తం చేశారు. ఇది సరైంది కాదని, దిగజారిన ప్రమాణమని, దాంతో తాము తీవ్ర అసంతృప్తికి గురయ్యామని, విచారం వ్యక్తం చేస్తున్నామని ఆయన అన్నారు. ఉమ్మడి గ్రాడ్యుయెట్ స్థాయి పరీక్షలో అటువంటి ప్రశ్న ఇవ్వడం లైంగిక వివక్ష అంటూ కేరళ మహిళా కమిషన్ ధ్వజమెత్తింది.
ఆ ప్రశ్న లోకసభకు సంబంధించిన ఓ ప్రశ్నకు, ప్రేమికుల రోజు నిర్వహించే నెలకు సంబంధించిన ప్రశ్నకు మధ్య ఇచ్చారు. ఈ కిందివారిలో ఎవరు పొడుగైనవారు అని అడిగి హుమా ఖురేషి, కత్రినా కైఫ్, దీపికా పడుకొనే, ప్రీతి జింటా అప్షన్లు ఇచ్చారు.
మరో ప్రశ్న కూడా మహిళలను కించ పరిచే విధంగా ఉంది. డిడక్టివ్ రీజనింగ్లో ఈ ప్రశ్న ఇచ్చారు. మహిళలందరూ పిల్లులు, అన్ని పిల్లులు ఎలుకలు అనేది ఆ ప్రశ్న. నిజానికి, తమ సంస్థకు చెందినవారు పేపర్ తయారు చేయరని, ప్రశ్నావళిని కూర్చడానికి స్థానిక టీచర్లను నియమించుకుంటామని, వాటిలోంచి ప్రశ్నలు ఏరుకుని పరీక్షకు ఇస్తామని భట్టాచార్య చెప్పారు.