Coronavirus: కరోనా కాలంలో 10వ తరగతి పరీక్షలు ప్రారంభం, 8 లక్షల మంది, దేవుడా, కాపాడు !
బెంగళూరు: భారతదేశంలో కరోనా వైరస్ (COVID 19) తాండవం చేస్తోంది. కరోనా వైరస్ భయంతోనే 10వ తరగతి (SSLC) పరీక్షలు రాయడానికి విద్యార్థులు ఉత్సాహంతో ముందుకు వచ్చారు. అయితే కరోనా కాలంలో పరీక్షలు రాయడానికి వెళ్లిన తమ పిల్లలు క్షేమంగా ఇంటికి రావాలని, దేవుడా నువ్వే కాపాడాలి అని వేడుకుంటూ విద్యార్థుల కుటుంబ సభ్యులు వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. కర్ణాటకలో కరోనా వైరస్ తాండవం చేస్తున్నది. ఇలాంటి సమయంలోనే గురువారం 2, 879 పరీక్షా కేంద్రాల్లో 8, 48, 203 మంది విద్యార్థులు 10వ తరగతి పరీక్షలు రాయడానికి ఉత్సాహంగా తరలి వస్తున్నారని విద్యాశాఖా మంత్రి, విద్యాశాఖా అధికారులు తెలిపారు.
Recommended Video
Coronavirus: సిలికాన్ సిటీలో ఈ ప్రాంతాలు సీల్ డౌన్, చిల్లర గేమ్స్ ఆడితే ఎఫ్ఐఆర్, మొబైల్ ప్లాన్ !
సీఎం సంచలన నిర్ణయం
కరోనా వైరస్ వ్యాధిని అరికట్టడంలో కర్ణాటక ప్రభుత్వం శక్తి వంచనలేకుండా పని చేస్తోందని, దేశంలోని ఇతర రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కర్ణాటక ప్రభుత్వాన్ని ఆదర్శంగా తీసుకోవాలని ఇటీవల కేంద్రే ఆరోగ్య శాఖ చెప్పిన విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం అభినందించకముందే కర్ణాటకలో 10వ తరగతి పరీక్షలు నిర్వహించాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప సంచలన నిర్ణయం తీసుకున్నారు.
8 లక్షల మంది విద్యార్థులు
కర్ణాటకలో గురువారం నుంచి 8, 48, 203 మంది విద్యార్థులు 10వ తరగతి పరీక్షలు రాయడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. బెంగళూరు నగరంతో సహ కర్ణాటకలో మొత్తం 2, 879 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. 10వ తరగతి పరీక్షలు సజవుగా సాగడానికి విద్యాశాఖ, పోలీసు, వైద్య శాఖ తదితర సంబంధిత శాఖలకు చెందిన 81, 265 మంది అధికారులు, ఉద్యోగులు, సిబ్బందిని నియమించారు. 10వ తరగతి నిర్వహణ కోసం దాదాపు 90, 000 మంది ఉద్యోగులకు పైగా గురువారం విధులకు హాజరైనారు.
ప్రతి రూంలో సీసీ కెమెరాలు
రాష్ట్రంలోని 2, 879 పరీక్షా కేంద్రాల్లోని ప్రతి రూంలో ప్రత్యేక సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి 10వ తరగతి పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రతి గదిలో 18 మంది విద్యార్థులు మాత్రమే కుర్చోవడానికి అవకాశం కల్పించారు. ఏ గదిలో కూడా 18 మంది విద్యార్థులకు మంచి ఒక్క విద్యార్థి కూడా ఉండటానికి అవకాశం ఇవ్వకూడదని ఇప్పటికే వైద్య, విద్యాశాఖ అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రతి పరీక్షా కేంద్రానికి స్వ్కాడ్ అధికారులు, సిబ్బంది వెళ్లడానికి ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేశారు.
విద్యార్థులు, తల్లిదండ్రులకు సూచనలు
10వ తరగతి పరీక్షలు రాయడానికి వచ్చే విద్యార్థులు, వారి కుటుంబ సభ్యులకు కర్ణాటక ప్రభుత్వం అనేక సూచనలు, సలహాలు ఇచ్చింది. పరీక్షలు రాయడానికి వచ్చే ముందు ఆహారం తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది. ప్రతి విద్యార్థి పరీక్షా కేంద్రానికి వచ్చే ముందు ఇంటి నుంచి వేడినీళ్లు వెంట తీసుకురావాలని విద్యాశాఖ అధికారులు సూచించారు. పరీక్షా కేంద్రాల్లో ప్రతి విద్యార్థికి 250 మి.లీ. నీళ్లు అందించడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు.
అసలు పరీక్ష ఎవరికంటే?
10వ తరగతి పరీక్షలు రాయడానికి గురువారం ఉదయం విద్యార్థులు చాలా ఉత్సాహంగా వచ్చారు. పరీక్షా కేంద్రాల దగ్గర విద్యార్థులను వదిలిపెట్టడానికి వారి వెంట వారి కుటుంబ సభ్యులు వెళ్లారు. అయితే పరీక్షా కేంద్రాల్లోకి విద్యార్థులు వెళ్లిన వెంటనే వారి కుటుంబ సభ్యులను అక్కడి నుంచి పంపించేశారు. పరీక్షా సమయం పూర్తి అయిన తరువాత మళ్లీ ఇక్కడి వచ్చి మీ పిల్లలను వెంట తీసుకెళ్లాలని, ఇక్కడ గుంపులు గుంపులుగా ఉండకూడదని అధికారులు, పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. పరీక్షాలు రాస్తున్న మా పిల్లల కంటే మమ్మల్ని ఇక్కడి నుంచి పంపించి మళ్లీ రమ్మని చెప్పి మా ఓపికకు అసలు పరీక్ష పెడుతున్నారని కొందరు విద్యార్థుల కుటుంబ సభ్యులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
గుడ్ లక్ చెప్పిన సీఎం
గురువారం నుంచి 10వ తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులు అందరికీ కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప శుభాకాంక్షలు చెప్పారు. ఏ ఒక్క విద్యార్థికి కరోనా వైరస్ సోకకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఇప్పటికే వైద్య, విద్యాశాఖ అధికారులకు సీఎం బీఎస్. యడియూరప్ప సూచించారు. ఇక హోమ్ క్వారంటైన్ లో ఉంటున్న వైద్య విద్యాశాఖా మంత్రి డాక్టర్ సుధాకర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో ఎప్పటికప్పుడు చర్చించి వివరాలు సేకరిస్తున్నారు. ఇక కర్ణాటక విద్యాశాఖా మంత్రి సురేష్ కుమార్ గురువారం ఉదయం నుంచి బెంగళూరులో పలు ప్రాంతాల్లోని 10వ తరగతి పరీక్షా కేంద్రాలకు వెళ్లి అక్కడి పరిస్థితులు అడిగి తెలుసుకుంటున్నారు. మొత్తం మీద కరోనా భయంతోనే కొన్ని లక్షల మంది విద్యార్థులు ఆందోళనతో 10వ తరగతి పరీక్షలు రాస్తున్నారు.