చిన్నమ్మ పార్టీ పగ్గాలు చేపట్టడం ఇక లాంఛనమే!..
పార్టీ ప్రధాన కార్యదర్శిగా శశికళ ఎంపిక పట్ల ఎవరికి అభ్యంతరం లేదని, పైగా పార్టీ వర్గాలంతా ఆమెనే ప్రధాన కార్యదర్శిగా ఉండాలని కోరుకుంటున్నట్టుగా పన్నీర్ సెల్వం తెలిపారు.
చెన్నై: అంతా అనుకున్నట్టే అన్నాడీఎంకె పగ్గాలు చిన్నమ్మ శశికళ చేతిలోకి వెళ్లడం దాదాపు ఖాయంగానే కనిపిస్తోంది. తమిళనాడు సీఎం పన్నీర్ సెల్వం వ్యాఖ్యలను బట్టి చూస్తే.. ఇక ఆ పదవిని ఆమెకు కట్టబెట్టడం లాంఛనమే అనిపిస్తోంది.
శశికళతో తనకెలాంటి విబేధాలు లేవని ప్రకటించిన పన్నీర్ సెల్వం.. పార్టీ ప్రధాన కార్యదర్శిగా శశికళకు మద్దతు పలుకుతున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే చిన్నమ్మ పార్టీ పగ్గాలు చేపట్టడం కోసం ఇప్పటికే గ్రౌండ్ వర్క్ పూర్తయిపోయిందన్న వాదనలు వినిపిస్తున్నాయి.
పార్టీ ప్రధాన కార్యదర్శిగా శశికళ ఎంపిక పట్ల ఎవరికి అభ్యంతరం లేదని, పైగా పార్టీ వర్గాలంతా ఆమెనే ప్రధాన కార్యదర్శిగా ఉండాలని కోరుకుంటున్నట్టుగా పన్నీర్ సెల్వం తెలిపారు. అమ్మ తర్వాత శశికళనే పార్టీకి ప్రత్యామ్నాయంగా అన్నాడీఎంకె నేతలు భావిస్తున్నట్టుగా సమాచారం.
ఈ మేరకు అన్నాడీఎంకె ప్రిసీడియం చైర్మన్ మధుసూదనన్, లోక్ సభ డిప్యూటీ స్పీకర్ తంబిదురై, పలువురు మంత్రులు మాజీ మంత్రులు సీనియర్ నేతలు గత శనివారం పోయెస్ గార్డెన్ లో శశికళను కలిసి విన్నవించారు. కాగా, అన్నాడీఎంకె పగ్గాలు చేపట్టే అర్హత శశికళకు లేదని జయలలిత మేనకోడలు దీప జయకుమార్ వాదిస్తున్న సంగతి తెలిసిందే.
అధికారికంగా పార్టీ పగ్గాలు ఎప్పుడు చేపడుతారో స్పష్టత లేనప్పటికీ.. రేపో మాపో చిన్నమ్మ పార్టీ బాధ్యతలు స్వీకరించడం మాత్రమే ఖాయంగానే కనిపిస్తోంది.