మోడీకి ఝలక్: పెద్దనోట్ల రద్దు ప్రజలు మేల్కొన్నపుడు చెయ్యాలి, అర్దరాత్రి కాదు, స్టాలిన్ !
పెద్దనోట్లు రద్దు ఎఫెక్ట్, ప్రధాని మోడీపై డీఎంకే ఫైర్ప్రజలు మేల్కొని ఉన్నప్పుడు నిర్ణయాలు తీసుకోవాలి, అర్దరాత్రి కాదు
చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధిని కలిసిన రెండు రోజులకే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి డీఎంకే పార్టీ పెద్ద ఝలక్ ఇచ్చింది. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం మీద డీఎంకే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంకే. స్టాలిన్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
ప్రజల స్వాతంత్రాన్ని అర్దరాత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం వెనక్కు లాగేసిందని, పేద ప్రజల జీవితాలను నాశనం చేసిందని ఆరోపించారు. పెద్దనోట్ల రద్దు వలన ప్రజలకు ఏం మేలు జరిగిందో ఎన్డీఏ ప్రభుత్వం బహిరంగంగా చెప్పాలని ఎంకే. స్టాలిన్ డిమాండ్ చేశారు.
పెద్దనోట్ల రద్దును వ్యతిరేకిస్తూ బుధవారం తమిళనాడులోని మధురైలో డీఎంకే, కాంగ్రెస్ పార్టీల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా కార్యక్రమానికి నల్ల రంగు షర్టు వేసుకుని వచ్చిన ఎంకే. స్టాలిన్ బ్లాక్ డే అంటూ నినాదాలు చేసి నిరసన వ్యక్తం చేశారు.
2016 నంబర్ 8వ తేదీ అర్దరాత్రి గుట్టుచప్పుడు కాకుండా నరేంద్ర మోడీ ప్రభుత్వం పెద్దనోట్లు రద్దు చేసిందని మండిపడ్డారు. ప్రభుత్వం ఏదైనా నిర్ణయాలు ప్రజలు మేల్కొని ఉన్న సమయంలో తీసుకోవాలని, ఇలా అర్దరాత్రి కాదని ఎద్దేవ చేశారు. పెదనోట్ల రద్దు కారణంగా చిరువ్యాపారులు రోడ్ల మీదపడ్డారని ఆరోపించారు.
పెద్దనోట్లు రద్దు చేసి ప్రజలను బ్యాంకులు, ఏటీఎంల ముందు గంటలు గంటలు నిలబెట్టారని, అంతకు మించి మీరే చేసింది ఏమీ లేదని ఎంకే స్టాలిన్ విమర్శించారు. డీఎంకే ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు నల్లరంగు షర్టులు వేసుకుని తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా పెద్దనోట్ల రద్దును వ్యతిరేకిస్తూ ధర్నాలు నిర్వహించారు. ప్రధాని నరేంద్ర మోడీ చెన్నైలోని కరుణానిధి ఇంటికి వెళ్లి వచ్చిన రెండు రోజుల్లోనే డీఎంకే పార్టీ కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి ఝలక్ ఇచ్చింది.